AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Eng T20 : సంజూకే నా ఓటు.. వైభవ్ ఎంట్రీపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు

Ind Vs Eng T20 : భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20కి ముందు వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజూ శాంసన్‌కే మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, అనుభవజ్ఞుడైన మ్యాచ్ విన్నర్‌పై జట్టు విశ్వాసం కొనసాగించాలని సూచించారు.

Ind Vs Eng T20 : సంజూకే నా ఓటు.. వైభవ్ ఎంట్రీపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jul 03, 2026 | 11:11 AM

Share

Ind Vs Eng T20 : భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్‌తో పాటు, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లోనూ ఈ యువ ఆటగాడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. దీంతో వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానుల నుంచి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ భిన్నంగా స్పందించారు. వైభవ్‌పై అభిమానుల్లో ఉన్న ఉత్సాహం నిజమే అయినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అంత సులువు కాదని, ఇక్కడ అనుభవానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని డీకే స్పష్టం చేశారు.

క్రిక్‌బజ్ టాక్ షోలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సంజూ శాంసన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. “గడిచిన మూడు మ్యాచ్‌లలో సంజూ శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అందుకే వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకురావాలనే ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌కే మరికొన్ని అవకాశాలు ఇవ్వాలి” అని కార్తీక్ అభిప్రాయపడ్డారు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో సంజూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ కప్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడని, ప్రస్తుతం అతడు కొంత మానసిక ఒత్తిడిలో ఉన్నాడని గుర్తు చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో జట్టు అతడికి అండగా నిలవడం చాలా అవసరమని, వైభవ్‌కు భవిష్యత్తులో ఆడేందుకు చాలా సమయం ఉందని డీకే పేర్కొన్నారు.

ఒకవేళ మేనేజ్‌మెంట్ గనుక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని భావిస్తే.. ప్రస్తుతం ఆడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ లేదా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌లలో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లోనూ, వరల్డ్ కప్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, గత మూడు మ్యాచ్‌లుగా ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. అయినప్పటికీ, సంజూ లాంటి మ్యాచ్ విన్నర్‌ను ఒక్కసారిగా జట్టు నుంచి తొలగించడం సరికాదని, వరల్డ్ కప్ లాంటి హై ప్రెషర్ మ్యాచ్‌లలో రాణించిన అనుభవం అతడికి ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం పడటానికి ముందే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం కొన్ని బంతుల్లోనే 59 పరుగులతో విరుచుకుపడగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 రన్స్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ (1 రన్), ఇషాన్ కిషన్ (0 రన్) ఘోరంగా నిరాశపరిచారు. అయినప్పటికీ మిడిల్ ఓడర్‌లో వచ్చిన శివం దూబే కేవలం 21 బంతుల్లో 42 పరుగులు చేసి అదరగొట్టాడు. వీరి ముగ్గురి మెరుపు ఇన్నింగ్స్‌ల పుణ్యమా అని భారత్ నిర్ణీత ఓవర్లలో 189 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి శనివారం మాంచెస్టర్ వేదికగా జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌పైనే ఉంది. ఈ మ్యాచ్‌లోనైనా సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. మరి ఈ రెండో టీ20 లోనైనా సంజూ శాంసన్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడా.. లేక ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఇంటర్నేషనల్ క్యాప్ దక్కుతుందా అనేది శనివారం సాయంత్రం తేలనుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us