IND vs SL: క్రికెట్ మ్యాచ్‌లో అపశ్రుతి..బంతిని ఆపేయత్నంలో ఒకరినొకరు ఢీ కొన్న లంక ఫీల్డర్లు.. ఆస్పత్రికి తరలింపు

బంతిని ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు శ్రీలంక ఫీల్డర్లు తీవ్రంగా గాయపడ్డారు. బంతిని అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం ఢీకొన్నారు. ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది

IND vs SL: క్రికెట్ మ్యాచ్‌లో అపశ్రుతి..బంతిని ఆపేయత్నంలో ఒకరినొకరు ఢీ కొన్న లంక ఫీల్డర్లు.. ఆస్పత్రికి తరలింపు
India Vs Sri Lanka
Follow us

|

Updated on: Jan 15, 2023 | 8:01 PM

తిరువనంతపురం వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలోఅపశ్రుతి చోటుచేసుకుంది. బంతిని ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు శ్రీలంక ఫీల్డర్లు తీవ్రంగా గాయపడ్డారు. బంతిని అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం ఢీకొన్నారు. ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కరుణరత్నె బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బంతిని బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతిని ఆపేందుకు డీప్‌ స్క్వేర్‌, మిడ్‌ వికెట్‌ ఫీల్డర్లు వాండర్సే, అషేన్ బండారా ఇద్దరూ ప్రయత్నించారు. ఇద్దరి మధ్యా సమన్వయం లేకపోవడంతో ఒకరినొకరు ఢీకొన్నారు. వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చారు. శ్రీలంక ఆటగాళ్లకు సహాయం చేసేందుకు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ కూడా గ్రౌండ్‌లోకి వచ్చింది. అయితే పరిస్థితి సీరియస్ కనిపించడంతో బండారాను స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లిపోయారు. వాండర్సే కూడా గాయపడినప్పటికీ.. అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. కాగా ఈ ఘటనలో బండారా మోకాలికి తీవ్రగాయమైనట్లు తెలుస్తోంది. మోకాలికి సంబంధించి స్కాన్‌ తీసిన అనంతరమే అతని పరిస్థితి ఏంటనేది తెలియనుంది. కాగా ఇద్దరు ఆటగాళ్లు గాయపడడంతో ఇరు జట్లలోని ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షక్షులు కాసేపు ఆందోళన చెందారు.

కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (166) తో పాటు ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ (116) సెంచరీలతో చెలరేగాడు. . రోహిత్ (42), శ్రేయస్‌ అయ్యర్‌ (38) రాణించారు. కేఎల్‌ రాహుల్‌ (7), సూర్యకుమార్‌ యాదవ్‌ (4) విఫలమయ్యారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో లంక తడబడుతోంది. కడపటి వార్తలందే సమయానికి 15 ఓవర్లలో 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 4 వికెట్లతో విజృంభించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..