IND vs ENG: రోహిత్ శర్మ రికార్డుకు ఎసరు.. గిల్ దోస్త్ సరికొత్త చరిత్ర..!
సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ పోరు ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు సిరీస్ విజయం కోసం, అటు వ్యక్తిగత రికార్డుల కోసం ఆటగాళ్లు సర్వశక్తులూ ఒడ్డనున్నారు. రోహిత్ శర్మ రికార్డును బట్లర్ అధిగమించడమే కాకుండా, టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఆఖరి టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు సిరీస్ క్లీన్స్వీప్ను అడ్డుకోవాలని టీమిండియా చూస్తుంటే, మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ భారత మాజీ సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ వివరాలు ఓసారి చూద్దాం..
హిట్మ్యాన్ను వెనక్కి నెట్టనున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా లెజెండ్ రోహిత్ శర్మ రికార్డును అధిగమించేందుకు ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ముంగిట నిలిచాడు. సౌతాంప్టన్ వేదికగా భారత్తో జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ బట్లర్ కెరీర్లో అత్యంత కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్లో అతడు మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం, రోహిత్ శర్మను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండో అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163 మ్యాచ్లు) పేరిట ఉంది. కాగా, భారత్కు చెందిన రోహిత్ శర్మ, ఐర్లాండ్కు చెందిన జార్జ్ డాక్రెల్, అలాగే ఇంగ్లాండ్కు చెందిన జోస్ బట్లర్ ముగ్గురూ చెరో 159 మ్యాచ్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు సౌతాంప్టన్ మ్యాచ్ ద్వారా బట్లర్ తన 160వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ, డాక్రెల్లను మూడో స్థానానికి నెట్టి బట్లర్ ఒంటరిగా రెండో స్థానాన్ని ఆక్రమించనున్నాడు.
పరుగుల వేటలో మాత్రం రోహితే తోపు..!
అత్యధిక మ్యాచ్ల పరంగా జోస్ బట్లర్ రోహిత్ శర్మను దాటిపోతున్నప్పటికీ, పరుగుల విషయంలో మాత్రం హిట్మ్యాన్ చాలా ముందంజలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన టాప్-5 ఆటగాళ్లలో రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. రోహిత్ తన 159 మ్యాచ్ల కెరీర్లో 4,231 పరుగులు సాధించగా, జోస్ బట్లర్ ఇప్పటివరకు ఆడిన 159 మ్యాచ్లలో 4,081 పరుగులు చేశాడు. మ్యాచ్ల సంఖ్య పెరిగినా రోహిత్ పరుగుల రికార్డును అందుకోవడం బట్లర్కు ప్రస్తుతానికి సాధ్యం కాదు.
ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..!
మరో రికార్డుపై కన్నేసిన అదిల్ రషీద్..
ఈ మ్యాచ్ కేవలం జోస్ బట్లర్కు మాత్రమే కాదు, ఇంగ్లాండ్ వెటరన్ స్పిన్నర్ అదిల్ రషీద్కు కూడా ఎంతో ప్రత్యేకం కానుంది. ఇప్పటివరకు 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన రషీద్, సౌతాంప్టన్ బరిలోకి దిగితే 150 మ్యాచ్ల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రషీద్ రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం 150 కి పైగా మ్యాచ్లు ఆడిన క్లబ్లో పాల్ స్టిర్లింగ్, రోహిత్ శర్మ, జార్జ్ డాక్రెల్, జోస్ బట్లర్, మహ్మద్ నబీ మాత్రమే ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



