AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం.. క్రికెట్ అంటే మగాళ్లేనా? మన మైండ్‌సెట్‌ను కడిగిపారేస్తున్న వరల్డ్ కప్ ప్రోమోలు

క్రికెట్ అంటే కేవలం మెన్స్ క్రికెట్ మాత్రమే కాదని, మహిళా క్రికెటర్లు కూడా భారత క్రికెట్‌కు సమాన ప్రతినిధులేనని ఐసీసీ తన కొత్త ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రచార వీడియోల ద్వారా బలంగా చెబుతోంది. ప్రేక్షకుల మైండ్‌సెట్‌ను మార్చే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రోమోలు సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతున్నాయి.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం.. క్రికెట్ అంటే మగాళ్లేనా? మన మైండ్‌సెట్‌ను కడిగిపారేస్తున్న వరల్డ్ కప్ ప్రోమోలు
Women's T20 World Cup 2026
SN Pasha
|

Updated on: Jun 04, 2026 | 8:01 PM

Share

క్రికెట్ అనగానే చాలా మందికి సచినో, కోహ్లీనో, ధోనినో గుర్తుకు వస్తారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ గుర్తుకు వస్తారు. యూత్‌లో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న ఉమెన్ క్రికెటర్ అంటే స్మృతి మంధాననే. అయినా ఆ క్రేజ్‌ కూడా ఆటతోపాటు అందంగా ఉందనే కారణంతో వచ్చింది. ఇది వినేందుకు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా అదే పచ్చి నిజం. క్రికెట్‌ ప్రపంచంలో అమ్మాయిలు అద్భుతాలు చేస్తున్నా.. ఇప్పటికీ క్రికెట్ అంటే మెన్స్ క్రికెట్ అనే భ్రమలో మనలో చాలా మంది ఉన్నారు. ఈ మైండ్ సెట్‌ను మార్చేందుకు ఏకంగా ఐసీసీనే బరిలోకి దిగింది.

ఈ నెల 12 నుంచి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నిజం చెప్పాలంటే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వార్త చదివే వారికి కూడా ఇప్పుడే ఈ విషయం తెలిసి ఉండొచ్చు. ఇంకా ఐపీఎల్ మూడ్ నుంచి బయటికి రాని వారికి కూడా 6వ తేదీ నుంచి పసికూన ఆఫ్ఘనిస్థాన్‌తో మెన్స్ టీమ్ టెస్ట్ ఆడుతుందనే విషయం తెలుసుకాని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఉందనే విషయం తెలియదు. ఈ ఒక్క విషయం చాలు.. ఉమెన్స్ క్రికెట్ ఎంత నిరాదరణకు గురవుతుందో చెప్పడానికి. అందుకే ఐసీసీ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.

సాధారణంగా వరల్డ్ కప్ టోర్నీల కంటే ముందు ప్రోమో వీడియాలతో టోర్నీకి ప్రచారం కల్పిస్తారు. ఇప్పుడు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందు కూడా ప్రోమోలు వదులుతున్నారు. అయితే వీటిలో క్రికెట్‌ను ప్రమోట్ చేయడం కంటే.. మన మైండ్‌సెట్‌ను మార్చడంపై దృష్టి పెట్టారు. ఆ ప్రోమోలు చూస్తే.. పురుషాధిక్య సమాజాన్ని చెంప చెల్లుమనిపించేలా ఉన్నాయి. మచ్చుకు ఓ రెండు ప్రోమోల గురించి మాట్లాడుకుంటూ.. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఒక్క సారిగా హడావిడి మొదలు అవుతుంది. ఏం జరుగుతుందని అందులోని ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను అడుగుతాడు. దాంతో ఆమె ఇండియన్ క్రికెట్ టీమ్ వస్తుందని సమాధానం చెబుతుంది. దాంతో ఆ వ్యక్తి ఛాంపియన్ టీమ్ వస్తుందని తన కొడుకుతో సంతోషంగా చెబుతాడు. అంతలోనే విమానంలోకి ఉమెన్స్ క్రికెటర్లు ఎంటర్ అవుతారు. వాళ్లని చూసి ఆ వ్యక్తి కాస్త నిరాశ చెందుతాడు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీమ్ అనగానే.. అతను మెన్స్ టీమ్ అని అనుకుంటాడు.. కానీ వచ్చింది ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ అని తెలిసి నిరాశ చెందుతాడు. కానీ, అతని కొడుకు మాత్రం.. జెమిమా కూడా ఉందా అంటూ ఎంతో ఉత్సాహంగా చూస్తుంటాడు. దాంతో ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుంటాడు.. ఇండియన్ టీమ్ అంటే మెన్స్ టీమ్ మాత్రమే కాదనే విషయం ఆ చిన్నారి స్పందనతో అతనికి బోధపడుతుంది.

వీడియో చూడండి

అలాగే మరో ప్రోమో విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, శర్వరి నటించిన ఈ ప్రోమోలో.. యాంకర్ మాట్లాడుతూ ఇండియా మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు, కానీ మీకు ఎవరు స్ఫూర్తినిస్తారు అని అడుగుతాడు. దాంతో ఆలియా ఇండియన్ క్రికెటర్స్ అంటూ బదులిస్తుంది. దానికి శర్వరి సైతం నాకు కూడా, ఎందుకంటే వాళ్లు ఛాంపియన్స్ అంటుంది. యాంకర్ మనసులో మెన్స్ క్రికెటర్లు అనుకుంటాడు. కానీ అంతలోనే ఆలియా స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్లు ప్రస్తావించడంతో అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. నిరాశగా మీరు ఉమెన్స్ క్రికెట్ టీమ్ గురించి మాట్లాడుతున్నారా? అంటాడు. దానికి ఆలియా అదే కదా చెప్పింది.. ఇండియన్ క్రికెట్ టీమ్ అని గట్టిగా అతనికి బుద్ధి వచ్చేలా చెబుతుంది. ఈ ప్రోమోలు చాలా క్రియేటివ్‌గా ఉండటంతో పాటు మన మైండ్ సెట్‌ను మార్చుకోమని చెబుతున్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని.. మెన్స్, ఉమెన్స్ అనే తేడా లేకుండా క్రికెట్‌ను ఎంజాయ్ చేద్దాం, ఇండియన్ క్రికెట్‌ను సపోర్ట్ చేద్దాం.

వీడియో చూడండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us