చైన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్కు భారీ షాకిచ్చింది. క్వాలిఫైయర్1లో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన చైన్నై ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్కు దూసుకెళ్లింది.చెన్నై ఇలా ఫైనల్కు వెళ్లడం పదోసారి. మొదటగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (42; 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. చెన్నై బౌలర్ల ధాటికి డాసున్ శనక (17), వృద్ధిమాన్ సాహా (12), విజయ్ శంకర్ (14), హార్దిక్ పాండ్య (8), డేవిడ్ మిల్లర్ (4), రాహుల్ తెవాతియా (3) వరుసగా పెవిలియన్కు చేరారు. చివర్లో రషీద్ ఖాన్ (30; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో కాస్త ఉత్కంఠభరితంగా మారింది. అయినప్పటికీ తుషార్ దేశ్పాండే వేసిన 19వ ఓవర్లో రషీద్ ఖాన్ ఔట్ కావడంతో చెన్నై విజయం ఖాయమైంది.
చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (60; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేయగా.. డేవాన్ కాన్వే (40; 34 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అజింక్య రహానె (17; 10 బంతుల్లో), అంబటి రాయుడు (17; 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు, మహ్మద్ షమి రెండు, రషీద్ఖాన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అయితే గుజరాత్ టైటాన్స్కు ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంది. ఫైనల్ బెర్తు కోసం ముంబయి, లక్నో మధ్య జరిగే మ్యాచ్లో విజేతతో తలపడనుంది. చెన్నైపై ఏ జట్టు ఫైనల్ ఆడనుందో అనేదానిపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..