Jasprit Bumrah : మూడు ఫార్మాట్లు ఆడుతున్నా తప్పని తిప్పలు.. బుమ్రాకు రూ. 2 కోట్లు కోత పడనుందా?
Jasprit Bumrah : బీసీసీఐ కొత్త కాంట్రాక్టుల వల్ల జస్ప్రీత్ బుమ్రాకు రూ.2 కోట్ల నష్టం వచ్చేలా ఉంది. ఏ ప్లస్ గ్రేడ్ రద్దుతో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.బోనస్ రూపంలో ఈ లోటును పూడ్చేలా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

Jasprit Bumrah : ఐపీఎల్ హడావుడి మొదలయ్యే ముందే బీసీసీఐ ప్లేయర్ల కాంట్రాక్ట్ లిస్టును విడుదల చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఏకంగా రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లేలా కొత్త నిబంధనలు ఉన్నాయనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బీసీసీఐ ఇటీవల 2025-26 సంవత్సరానికి సంబంధించి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. ఇందులో ఊహించని విధంగా అత్యున్నత కేటగిరీ అయిన A+ గ్రేడ్ను పూర్తిగా తొలగించింది. గతంలో ఈ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్ల పారితోషికం లభించేది. ఇప్పుడు గ్రేడ్ A నే టాప్ కావడంతో, అందులో ఉన్న ప్లేయర్లకు కేవలం రూ.5 కోట్లు మాత్రమే దక్కనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా గత ఏడాది వరకు ఏ ప్లస్ గ్రేడ్లో ఉండి రూ.7 కోట్లు అందుకునేవారు. తాజా మార్పుతో ఆయన గ్రేడ్ ఏ కి పరిమితం కావడంతో నేరుగా రూ.2 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు ఇప్పుడు అన్ని ఫార్మాట్లు (టెస్ట్, వన్డే, టీ20) ఆడటం లేదు కాబట్టి వారిని తక్కువ గ్రేడ్లో ఉంచడం సమంజసమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ జస్ప్రీత్ బుమ్రా పరిస్థితి అలా కాదు. ఆయన ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో టీమిండియాకు వెన్నెముకగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్గా పేరున్న బుమ్రాకు జీతం తగ్గించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి ఫామ్లో ఉండి, జట్టు కోసం నిరంతరం కష్టపడుతున్న ఆటగాడికి ఇలా జరగడం అన్యాయమని చర్చ నడుస్తోంది.
బుమ్రాకు జరుగుతున్న ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. బుమ్రా వంటి స్టార్ ఆటగాడి జీతం రూ.7 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించడం సరైన నిర్ణయం కాదని బోర్డు పెద్దలు కూడా భావిస్తున్నట్లు సమాచారం. కేవలం బుమ్రా మాత్రమే కాదు, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాడు C గ్రేడ్కు పడిపోవడంపై కూడా సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ నిబంధనల్లో మార్పులు చేసి లేదా బోనస్ రూపంలో ఈ లోటును పూడ్చేలా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
