AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!

Hindu Traditions: మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదని మన పూర్వీకులు ఎందుకు చెబుతారు? మనుస్మృతి, మహాభారతంలోని ధర్మబోధనలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం దీనికి ఉన్న కారణాలేంటి? మరణించిన వారిని అవమానించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రభావాలు, మనశ్శాంతిపై దాని ప్రభావం గురించి తెలుసుకుందాం.

Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
Hindu Belief
Rajashekher G
|

Updated on: Aug 14, 2026 | 8:42 AM

Share

Hindu Belief Telugu: మన పూర్వీకులు, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు అందించిన ముఖ్యమైన జీవన సూత్రాల్లో ఒకటి. మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు, అవమానించకూడదు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మనకు ఎంత బాధ కలిగించినా, ఎంత అన్యాయం చేసినా.. వారు మరణించిన తర్వాత వారి లోపాలను పదేపదే ప్రస్తావించడం కంటే, వారి మంచి లక్షణాలను గుర్తుచేసుకోవడమే మానవత్వానికి నిదర్శనమని పెద్దలు సూచించారు. హిందూ సంప్రదాయంలో మరణం అనేది జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా, ఒక జీవాత్మ తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగించే దశగా భావిస్తారు. అందుకే మరణించిన వారి పట్ల గౌరవం, సంయమనం పాటించాలని ధర్మశాస్త్రాలు సూచిస్తాయి.

మనుస్మృతి వంటి ధర్మగ్రంథాల భావన ప్రకారం.. మనిషి మరణించినంత మాత్రాన అతనితో మనకు సంబంధించిన భావోద్వేగాలు, జ్ఞాపకాలు వెంటనే ముగిసిపోవు. ద్వేషం, కోపం, పగ వంటి ప్రతికూల భావాలను కొనసాగించడం వల్ల మన మనసులోనే ఆ బంధం కొనసాగుతుంది. దీంతో మనశ్శాంతి దెబ్బతినే అవకాశం ఉందని ఆధ్యాత్మిక దృష్టిలో చెబుతారు.

అలాగే మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మం, క్షమ, సంయమనం వంటి విలువలకు ప్రాధాన్యత ఇస్తాడు. మరణించిన వారి పట్ల కూడా గౌరవాన్ని కోల్పోకూడదనే భావన ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే మరణించిన వ్యక్తిని అవమానించడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా, అలా మాట్లాడే వ్యక్తి మనసులో మాత్రం కోపం, ద్వేషం, ప్రతికూలత మరింత బలపడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. మరణించిన వ్యక్తిని దూషించడం లేదా ఎగతాళి చేయడం ఒక రకమైన ఆధ్యాత్మిక అపచారంగా భావిస్తారు. మరణించిన వారి ఆత్మకు హాని కలుగుతుందని కంటే, వారిపై ద్వేషాన్ని కొనసాగించే వ్యక్తి తన మనశ్శాంతిని, ఆధ్యాత్మిక ఎదుగుదలను తానే దెబ్బతీసుకుంటాడనే భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

అందుకే మన పూర్వీకులు “చనిపోయినవారి గురించి చెడుగా మాట్లాడకూడదు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవాలి” అని సూచించారు. గతంలో జరిగిన బాధలను పూర్తిగా మర్చిపోవడం సాధ్యం కాకపోయినా, మరణించిన వ్యక్తిపై ద్వేషాన్ని కొనసాగించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మనకే మేలు చేస్తుంది.

చివరికి, ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు.. మానవత్వం, క్షమ, సంయమనం, మనశ్శాంతి వంటి విలువలను గుర్తుచేసే ఒక గొప్ప జీవన సందేశం. మరణించిన వారిని గౌరవించడం ద్వారా వారి కంటే మన మనసును, మన ఆలోచనలను మరింత ఉన్నతంగా ఉంచుకోవచ్చని ఆధ్యాత్మికవాదులు చెబుతారు.

(Disclaimer: ఈ కథనంలోని విషయాలు హిందూ ధార్మిక విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావనలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా భావించకండి.)

Follow Us