AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి..? ప్రారంభమైన మాలాధరణలు.. దీక్ష నియమ నిబంధనలు..!

Ayyappa Deeksha: కార్తీకమాసం మొదలుకాగానే గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం.. శరణం అంటూ కోరిన..

Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి..? ప్రారంభమైన మాలాధరణలు.. దీక్ష నియమ నిబంధనలు..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 04, 2021 | 9:11 AM

Share

Ayyappa Deeksha: కార్తీకమాసం మొదలుకాగానే గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం.. శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢసంకల్పంతో చేసే దీక్ష అయ్యప్ప దీక్ష. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి 18 కొండలు, 18 మేట్లపై అధిష్టించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. కొందరు స్వాములు దీక్ష చేపట్టిన నాటి నుంచి 41 రోజుల పాటు శబరిమలైకి పాదయాత్ర చేసి స్వామిని దర్శించుకుంటారు. ఈ పాదయాత్ర కూడా ప్రారంభమైంది.

అయ్యప్ప దీక్ష అంటే..?

అయ్యప్ప దీక్షఅంటే శబరిమలైలోని అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా చేసే దీక్ష. 41 రోజులు ఉంటుంది. ఈ దీక్ష చేసే వారు నియమ నిష్టలు పాటించాలి. దీక్ష అనంతరం ఇరుముడితో శబరిమలై బయలుదేరి స్వామివారిని దర్శించుకోవాలి. ఇరుముడిని స్వామివారికి అర్పించితేనే తమ సంకల్పాలు, కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే ముందు..

అయ్యప్ప దీక్ష తీసుకొనే ముందుగా రెండు రోజుల నుంచి మద్యం, మంసహారాలు తీసుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత దీక్ష తీసుకొనే రోజు ఉదయాన్నే స్నానం ఆచరించి ఇంట్లో నిత్యపూజ చేసి తల్లిదండ్రులకు, పెద్దలకు పాదాభివందనం చేసి ధర్మపత్ని అనుమతితో దీక్ష తీసుకోవాలి.

దీక్ష ఎలా తీసుకోవాలి..

అయ్యప్పస్వామి దీక్షను అయ్యప్ప ఆలయంలో గానీ ఇతర ఆలయాల్లో గాని తీసుకోవచ్చు. 108 పూసలతో గల తులసిమాలను ముందుగా అర్చన చేసి మూలమంత్రాన్ని గురుస్వాములతో గానీ, ఆలయ అర్చకులతో గానీ ఉచ్ఛరించి దీక్షను చేపట్టాలి. దీక్ష పూర్తయి శబరిమలైకి వెళ్లి వచ్చే వరకు మాలను మెడలో నుంచి తీయకూడదు. దీక్షలో ఉన్న రోజుల్లో తమకు తోచిన విధంగా కనీసం ఐదుగురు స్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు అయ్యప్ప ఆలయంతో పాటు ఇతర ఆలయాలు దర్శించుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో అబద్దాలు, తప్పులు చేయకూడదు.

ఇరుముడి అంటే..

పరమపవిత్రమైన అయ్యప్ప దీక్ష 41 రోజులు పూర్తయిన తర్వాత శబరిమలైకి బయలుదేరే స్వామివారికి సమర్పించేందుకు తీసుకెళ్లేదే ఇరుముడి. ఇరుముడి అంటే రెండు ముళ్లు కలదని. ఒక కొత్త బట్టను రెండు ముళ్లు వచ్చే విధంగా కుట్టించి భక్తి శ్రద్దలతో ఆలయ ప్రాంగణంలో గురుస్వాములచే ఇరుముడిని కట్టుకుంటారు. ముందు ముడిలో దేవుడికి సంబంధించి సామాగ్రి, వెనుక ముడిలో ఇతర సామాగ్రి ఉంటాయి. ఒక కొబ్బరి కాయలోని నీటిని తొలగించి ఫలాన్ని ఆవునెయ్యితో నింపుతారు. తర్వాత దానిని శుభ్రతతో మూటకట్టి ఇరుముడి ముందు భాగంలో పెడతారు. అలాగే నాలుగు కొబ్బరి కాయలు, పూజాసామాగ్రిని చేర్చుతారు. ఇదే స్వామి వారికి సమర్పించే ఇరుముడి.

దీక్ష నియమాలు..

అయ్యప్పస్వామి దీక్ష ఎంతో కఠోరమైనది. దీక్షా సమయంలో ముందుగా గురుస్వాములు చెప్పినట్లుగా నడుచుకోవాలి. మాలాధారణ తర్వాత ఈ జీవకోటి అన్ని ప్రాణులను సాక్షాత్తు అయ్యప్పస్వామి వారి మాదిరిగా చూసుకోవాలి. అందరినీ స్వామి అనే నామంతో పిలవాలి. నల్ల బట్టలు ధరించి మెడలో గురుస్వామి వేసిన అయ్యప్పస్వామివారి లాకెట్‌తో తులసి మాలతో ప్రతీ రోజు ఉదయం సూర్యోదయం కన్నా ముందు, సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత చల్లని నీటితో తలస్నానమాచరించాలి. ఉదయం సాయంకాలం శరణుఘోషతో స్వామివారిని పూజించాలి. నుదుటపై ఎప్పుడూ గంధం, భస్మం కుంకుమలను పెట్టుకోవాలి. మధ్యాహ్నం సాత్విక భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. హోటళ్లలో, పెళ్లిళ్లలో, ఇతర ప్రాంతాల్లో భోజనం చేయకూడదు. తీసుకునే బిక్షలో అల్లం, వెల్లుల్లి, మసాలాలు వంటి దినుసులు ఉండకూడదు. రాత్రి నేలపై చాప వేసుకుని దిండు లేకుండా నిద్రించాలి. ప్రతి రోజు ఉతికిన బట్టలు ధరించాలి. దీక్షా సమయంలో ధూమపానం, మద్యం, గుట్కాలు, మంసం తదితర పదార్థాలను తీసుకోరాదు. ప్రతి మహిళను, భార్యను మాలికపురోత్తమ అమ్మవారిగా భావించాలి. దీక్షలో ఉన్న సమయంలో మనస్సులో ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా అయ్యప్పస్వామిని స్మరించుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Diwali 2021: సుఖ సంతోషాలతో ఉండాలంటే దీపావళి ముందురోజు ఈ 5 పనులు చేయాలి..!

Diwali 2021: దీపావళి రోజున లక్ష్మీ, గణేషుడి విగ్రహాలు కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..