AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Equality: ఇల వైకుంఠాన్ని తలపిస్తున్న శ్రీరామనగరం.. స‌మ‌తామూర్తి సహస్రాబ్ది సమారోహం పరిసమాప్తం

శ్రీభగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సుసంపన్నమైంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు.

Statue of Equality: ఇల వైకుంఠాన్ని తలపిస్తున్న శ్రీరామనగరం.. స‌మ‌తామూర్తి సహస్రాబ్ది సమారోహం పరిసమాప్తం
Statue Of Equality (File)
Balaraju Goud
|

Updated on: Feb 14, 2022 | 6:01 PM

Share

Statue of Equality at Muchintal: ముచ్చింతల్‌ శ్రీరామనగరం(Sriramanagaram) వెలిగిపోతోంది. ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. అంతే కాకుండా అక్క‌డ స‌మ‌తా మూర్తి శ్రీరామానుజచార్య(Sri Ramanujacharya) వెయ్యి ఏళ్ల ఉత్స‌వాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ స‌హస్త్రాబ్ది వేడుకులు నేటితో ముగిశాయి. ఈ నెల 2 వ తేదీ నుంచి ప్రారంభమైన స‌మ‌తా మూర్తి స‌హ‌స్త్రాబ్ది వేడుక‌లు.. 12 రోజుల పాటు కొన‌సాగాయి. ఇవాళ చివ‌రి రోజు కావ‌డంతో స‌మ‌తా మూర్తి కేంద్రంలో ప్ర‌త్యేక పూజు నిర్వహిస్తున్నారు.

నిన్న రాష్ట్రపతి ఆవిష్కరించిన సమతామూర్తి స్వర్ణ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామీజీ. ముచ్చింతల్ శ్రీరామనగరంలో రామానుజ సమారోహం, సహస్త్రాబ్ది ఉత్సవాలు ఇవాళ్టితో పరిసమాప్తం కాబోతున్నాయి. సాయంత్రం 5గంటల నుంచి 8గంటల వరకూ 108 దివ్యదేశాల్లోని దేవతామూర్తుల కల్యాణోత్సవాలు జరగుతాయి. ఈనెల 2న ప్రారంభమైన రామానుజుల సహస్రాబ్ది వేడుకలు జాతర వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ కీలక ఘట్టాలున్నాయి. అందులో ఒకటి మహాపూర్ణాహుతి. రెండోది సువర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట. మూడోది దివ్యదేశాల్లోని దేవతామూర్తులకు కల్యాణోత్సవం.

ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. యజ్ఞంలోఓ భాగంగా విశ్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైయ్యూహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి పూజలను చేశారు. ప్రతిరోజు 114 యాగశాలలో 1035 హోమకుండాల్లో 5 వేల మంది రుత్విజులు భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ మహాపూర్ణాహుతితో యజ్ఞం సుసంపన్నమైంది.

మహాపూర్ణాహుతి తర్వాత యాగశాల నుంచి సమతామూర్తి స్ఫూర్తికేంద్రం వరకు పెరుమాళ్‌ యాత్రను నిర్వహించారు. 120 కిలోల శ్రీభగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమంత్రకంగా సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లి కుంభప్రోక్షణ చేసి విశేష అభిషేకాన్ని చేశారు. అనంతరం రామానుజాచార్యుల ప్రత్యేక ఆరాధన, దర్శనం జీయర్ స్వాముల ప్రత్యేక ప్రత్యక్ష పర్యవేక్షణలలో జరిగింది. ఆరాధన తర్వాత రుత్విజులు భక్తిపూర్వక నృత్యం చేశారు. సువర్ణమూర్తి ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ మొదలు అనేక రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు, సాధుసంతులు, విభిన్నరంగాల మహామహులు.. ఒక్కరేంటి ఈ నెల 2 నుంచి ఇవాళ్టి వరకూ ముచ్చింతల్‌లో ప్రతీరోజూ ఓ పండుగే. ఆ మహా ఘట్టం.. ఇవాళ్టి పూర్ణాహుతి, దేవతామూర్తుల కల్యాణోత్స ఘట్టంతో పరిసమాప్తం కాబోతున్నాయి.

ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రంగా, హిందూ దర్శన ప్రదేశంగా విలసిల్లుతుందన్నారు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి. శ్రీరామనగరంలో శిలా సంపద అత్యద్భుతంగా ఉందన్నారు. 108 దివ్యదేశాలను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

సమతా మూర్తి కేంద్రం ఆధ్మాత్మిక శోభతో అలరారుతోంది. అష్టాక్షరీ మంత్ర జపంతో మార్మోగిపోతోంది. ఆహ్వానాల మేరకు అతిరథుల ఆగమనం, నిష్క్రమణ పూర్తయిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి శ్రీరామనగరాన్ని యథావిథిగా సాధారణ భక్తులను అనుమతించబోతున్నారు.