Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbha Mela: మహాకుంభ మేళాకి భారీ ఏర్పాట్లు.. అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ నిర్ణయం

ప్రపంచం నలుమూలల ఉండే హిందువులకు మహా కుంభమేళాలో పాల్గొనడం ఓ కల. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ముగిసే ఈ మహాకుంభ మేళా ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. కుంభమేళాకు వచ్చిన ప్రజలు అయోధ్య బాలరాముడి దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Maha Kumbha Mela: మహాకుంభ మేళాకి భారీ ఏర్పాట్లు.. అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ నిర్ణయం
Maha Kumbha Mela 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2024 | 6:34 AM

మహా కుంభమేళా కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యటకులు పెద్ద ఎత్తున రానున్నట్లు యూపీ సర్కార్‌ భావిస్తోంది.

 అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ నిర్ణయం

కుంభమేళాకు వచ్చిన ప్రజలు అయోధ్య బాలరాముడి దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి కుంభమేళా జరుగుతుండడం వల్ల పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉంది. అందుకే అయోధ్యలోనూ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామ మందిర దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

 భద్రత కోసం పారా మిలిటరీ బలగాలతోపాటు 50 వేల మంది సిబ్బంది

మహా కుంభమేళ భద్రత కోసం పారా మిలిటరీ బలగాలతోపాటు 50 వేల మంది సిబ్బందిని నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన 2700 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. కుంభమేళా సమాచారం తెలుసుకోవడానికి 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బాట్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు వేల సంఖ్యలో టెంట్లు, షెల్టర్లతో మహా కుంభ్ నగర్ నిర్మిస్తున్నారు. దీన్ని గూగుల్ మ్యాప్ తోనూ అనుసంధానిస్తారు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు చికిత్స చేసేందుకు తాత్కాలిక ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మందికి చికిత్స అందించేందుకు వీలుగా బీష్మ క్యూబ్ ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు

భక్తులు కుంభ మేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 92 రోడ్లు పునర్నిర్మిస్తున్నారు. 17 ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అత్యాధునిక బహుళ విపత్తు నివారణ వాహనాలను మోహరిస్తున్నారు. సౌర విద్యుత్ తో లైటింగ్ వసతులు కల్పిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. మొత్తంగా ఈ మహా కుంభమేళాను ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..