Bhadradri Rama : భద్రాద్రి రాముడికి వైభవంగా మహాపట్టాభిషేకం, భక్తి ప్రపత్తులతో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు
Bhadradri Rama : ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేకం వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు.
Bhadradri Rama : ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేకం వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. స్థానిక నిత్యకల్యాణ మండపం దగ్గర వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ మహాపట్టాభిషేక క్రతువు నిర్వహించారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రాములోరికి అలంకరణ చేశారు. కరోనా దృష్ట్యా భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా మహాపట్టాభిషేకాన్ని జరిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు రజత రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. అయితే, స్వామివారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 27 వరకు నిత్యకళ్యాణాలు నిలిపేశారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థ ప్రసాదాలను కూడా ఆపేశారు. ఇలాఉండగా, నిన్న శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీరాముల వారిచే అమ్మవారి తలపై జిలకర్ర, బెల్లం పెట్టించారు. అనంతరం మాంగళ్యధారణ కార్యక్రమం జరిగింది. ఈ కమనీయ వేడుకను కరోనా మహమ్మారి కారణంగా భక్తజనుల సందడి లేకుండానే నిర్వహించారు. రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2021: రాజస్థాన్ జట్టుకు మూడు ఎదురుదెబ్బలు.. కోహ్లీసేనకు మరో విజయం లాంఛనమే.!