Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: వినాయక పూజలకు శ్రీకారం.. చంద్రయాన్ 3 రాకెట్ నమూనా.. డిస్కో లైట్స్‌తో త‌యారు

ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌ 3 విజయవంతంతో ప్ర‌పంచ దేశాలను మ‌న దేశాన్ని ఆకర్షించేలా చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ చంద్రయాన్ 3 రాకెట్ నమూనా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి అందరినీ అబ్బురపరిచారు.. రాకెట్ నమూనా నిర్మాణానికి ఒక చిత్ర‌కారుడు స‌హాయం తీసుకొని సుమారు వంద మంది యువకులు నెల రోజుల పాటు నిరంతరం కష్టించి యాభై అడుగుల రాకెట్ న‌మూనాను డిస్కో లైట్స్ తో త‌యారు చేశారు.

Ganesh Chaturthi: వినాయక పూజలకు శ్రీకారం.. చంద్రయాన్ 3 రాకెట్ నమూనా.. డిస్కో లైట్స్‌తో త‌యారు
Ganesh Pandal
Follow us
G Koteswara Rao

| Edited By: Surya Kala

Updated on: Sep 19, 2023 | 8:04 AM

వినాయక చవితి వేడుకలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుతున్నారు.. ప్రతి వీధి, వాడ అనే తేడా లేకుండా వినాయక మండపాలు, వివిధ రూపాల గణేష్ విగ్రహాలు, డప్పు వాయిద్యాలు తీన్మార్ డాన్స్ లతో మారుమ్రోగి పోతున్నాయి.. గ్రామస్థాయి నుండి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వరకు ప్రతి ఒక్కరూ వినాయక పూజలతో తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. భాద్రపద శుద్ధ చవితి రోజు దేవదేవుడు విఘ్నేశ్వరున్ని పూజించుకుంటే విఘ్నాలు తొలిగి సకల సౌఖ్యాలు, ఆయుర ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకోసం తమ ఆర్థిక స్తోమతను మించి మరీ వినాయక చవితిని భారీగా జరిపేందుకు సిద్ధపడతారు. అందులో భాగంగా ఈ ఏడాది విజయనగరం జిల్లాలోని సంతకవిటి మండలం పొనుగుటివలస లో గ్రామ యువకులు వినూత్నంగా వినాయక పూజలకు శ్రీకారం చుట్టారు..

ఇటీవల ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌ 3 విజయవంతంతో ప్ర‌పంచ దేశాలను మ‌న దేశాన్ని ఆకర్షించేలా చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ చంద్రయాన్ 3 రాకెట్ నమూనా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి అందరినీ అబ్బురపరిచారు.. రాకెట్ నమూనా నిర్మాణానికి ఒక చిత్ర‌కారుడు స‌హాయం తీసుకొని సుమారు వంద మంది యువకులు నెల రోజుల పాటు నిరంతరం కష్టించి యాభై అడుగుల రాకెట్ న‌మూనాను డిస్కో లైట్స్ తో త‌యారు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి వినాయక విగ్రహ ఆవిష్కరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. చంద్రయాన్ 3 రాకెట్ నమూనాతో రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికీ జాతీయతా భావాన్ని పెంపొందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈ మండపం ఏర్పాటుతో పొనుగుటివ‌ల‌సలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావటం ఎంతో సంతోషమని, ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి ప్రయోగాన్ని విజయవంతం చేశారని అందుకు తమ మద్దతుగా రాకెట్ రూపంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి తమ వంతు ధన్యవాదాలు తెలిపామని అంటున్నారు యువకులు.. అంతేకాకుండా శివుడి తల పై ఉండే చంద్రుడు శివుడులో ఒక భాగమని, అలాంటి చంద్రుడు మీదకు చంద్రయాన్ రాకెట్ వెళ్లిందని, ఆ రాకెట్ ద్వారా విఘ్నేశ్వరుడుని చంద్రుని వద్దకు పంపినట్లు భావిస్తున్నామని అంటున్నారు.. వినాయక చవితి సందర్భంగా శివునిలో భాగమైన విఘ్నేశ్వరుడిని రాకెట్ ద్వారా చంద్రుని వద్దకు పంపిస్తే ఎంతో మంచిదని, తద్వారా విఘ్నేశ్వరుడు ఆనందంతో తాము కోరిన కోరికలు తీరుస్తాడని, ఏ పని తలపెట్టిన విఘ్నాలు లేకుండా చేస్తారనే నమ్మకం తమకుందని చెప్తున్నారు. ఓ వైపు శాస్త్రవేత్తలకు ధన్యవాదాలతో పాటు మరో వైపు విఘ్నేశ్వరుడిని ఆనందపరిచేందుకు ఎంతో వ్యయప్రయాసలను భరించామని చెప్తున్నారు గ్రామ యువకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..