Iran and Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ దెబ్బకు భారతీయులకు షాక్.. ఈ వస్తువుల ధరలు త్వరలో పెరగొచ్చు.. సామాన్యులపై ప్రభావం
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావంతో భారతదేశంలో పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో సరుకు రవాణా నిలిచిపోయే అవకాశముంది. దీని ప్రభావం సరుకుల ధరలపై ప్రత్యక్షంగా పడనుంది. సబ్బు, బిస్కెట్లు లాంటి నిత్యావసర సరుకుల ధరలతో పాటు మరికొన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడనుంది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ, సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పశ్చిమాసియా దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్ ఎగుమతులు, దిగుమతులపై ఎఫెక్ట్ పడింది. చమురు ధరలు పెరుగుతుండగా.. దీని వల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు తరచూ ఇంట్లో ఉపయోగించే పలు వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముంది. యుద్దం మరో వారం రోజుల పాటు ఇలాగే కొనసాగితే ధరలు కాస్త పెరగొచ్చని బిజినెస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు ఏయే ధరలు పెరుగుతాయి..? సామాన్యులపై ధరల భారం పడుతుందా..? ఏయే దిగుమతులపై యుద్ద ప్రభావం పడుతుంది? అనే విషయాలు చూద్దాం.
వీటి ధరలు పెరిగే ఛాన్స్..
-ఇరాన్, ఇతర పశ్చిమాసియా దేశాల నుంచి భారత్కు ముడి చమురు ఎక్కువగా దిగుమతి అవుతుంది. వీటి సరఫరాకు అంతరాయం కలగడం వల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగొచ్చు
-ఇక రైతులు వినియోగించే ఎరువుల ధరలు పెరగొచ్చు. డీఏపీ, ఎస్ఎస్పీ ఎరువులు తయారు చేసేందుకు సల్పర్, సల్ప్యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. సల్పర్ దాదాపు 76 శాతం వరకు ఖతార్, ఓమన్, యూఏఈ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. వీటి రవాణాకు ఇబ్బంది జరిగితే ఎరువుల ధరలు పెరిగితే రైతులు నష్టపోవచ్చు
-ఇక పొద్దు తిరుగుడు నూనెను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. దీంతో వంట నూనె ధరలు పెరిగే అవకాశముంది
-ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది. ప్రస్తుతం రూ.91 నుంచి 93 వద్ద ట్రేడవుతుండగా.. త్వరలో రూ.95కి చేరుకోవ్చని విశ్లేషకులు అంచనా వేస్తారు. దీని వల్ల చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి
-సబ్బు, షాంపులు, బిస్కెట్లు, తలనూనె, పొద్దు తిరుగుడు పువ్వు నూనె ధరలు పెరుగుతాయి
-డిటర్జంట్లు, టూత్ పేస్టు ధరలు కూడా పెరుగుతాయి
యుద్దానికి తెర పడట్లే..
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దానికి ఇప్పట్లో తెరపడేటట్లు కనిపించడం లేదు. మరికొన్ని రోజుల పాటు యుద్దం కొనసాగే అవకాశముంది. ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతుండగా.. అమెరికా, ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నాయి. దుబాయ్, ఖతార్ వంటి పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలపై కూడా ఇరాన్ క్షిపణులతో దాడులు చేపడుతోంది. దీని వల్ల సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ధరలపై పడనుంది. ఇండియా దిగుమతులపై ఎక్కువ ఆధారపడుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశముంటుంది. దీర్ఘకాలం యుద్దం కొనసాగితేనే ధరలు పెరుగుతాయి. ఇప్పటికీ ఇప్పుడు పెరిగే అవకాశముంది.
