ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే విధానం రావాలి.. ఏపీ పంచాయతీ ఎన్నికలపై సోము వీర్రాజు సరికొత్త డిమాండ్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా... ఎస్ఈసీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు..
ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా… ఎస్ఈసీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. అన్ని విభాగాలు సహకరించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. నిర్బంధంగా నామినేషన్లు వేసే ప్రక్రియ ఎక్కడా జరగకుండా చూసుకోవాలన్నారు సోము వీర్రాజు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు ఆన్లైన్ ద్వారా వేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య నెలకొన్న వివాదాలకు సుప్రీంకోర్టు తీర్పుతో ఫుల్స్టాప్ పడింది. తీర్పు అనంతరం మరోసారి నిమ్మగడ్డ షెడ్యూల్ను విడుదల చేశారు. అప్పుడే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకురావడం ఆసక్తిగా మారింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడాలి. అభ్యర్థులపై దాడులు నియంత్రించేలా రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. పోలీసులు, ఇతర విభాగాలు కూడా ఎన్నికల సంఘానికి సహకరించాలి. బీజేపీ, జనసేన రెండు పార్టీలు కలిసే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థలకు మద్దతు ఇస్తాయని సోము వీర్రాజు తెలిపారు.