AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గుంతలు.. బురద.. నరకాన్ని తలపిస్తున్న రోడ్లు.. బురదలో పొర్లుతూ వినూత్న నిరసన!

హైదరాబాద్‌లో గుంతలు, బురదమయమైన రోడ్లపై ఓ వ్యక్తి బురదలో పొర్లుతూ వినూత్న నిరసన చేపట్టారు. ఇమ్లీబన్-పుత్లీబౌలి వంటి ప్రధాన రహదారుల దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రమాదకరంగా మారిన రోడ్లతో వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ నిరసన హైలైట్ చేసింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారకముందే అధికారులు స్పందించాలని కోరారు.

Hyderabad: గుంతలు.. బురద.. నరకాన్ని తలపిస్తున్న రోడ్లు.. బురదలో పొర్లుతూ వినూత్న నిరసన!
Hyderabad Roads Condition
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 8:53 AM

Share

హైదరాబాద్: నగరంలో రోడ్ల దుస్థితిపై ఓ వ్యక్తి చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది. గుంతలమయమైన రోడ్డుపై పేరుకుపోయిన బురదలో ఏకంగా పొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విధంగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఇమ్లీబన్‌ నుంచి పుత్లీబౌలి వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడటంతో పాటు వర్షం పడిన ప్రతిసారీ వాటిలో నీరు, బురద చేరుతున్నాయని చెబుతున్నారు. దీంతో రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు.

ఈ మార్గం ఎంజీబీఎస్‌ నుంచి కోటి, చాదర్‌ఘాట్‌ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం భారీగా ట్రాఫిక్‌ ఉంటుంది. గుంతలు కనిపించక వాహనదారులు ఒక్కసారిగా వాటిలో పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు దుస్థితిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని నిరసనకారులు ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే అధికారులు స్పందించేలా చేయాలనే ఉద్దేశంతో బురదలో పొర్లుతూ నిరసన చేపట్టినట్లు తెలిపారు.

నిరసన సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే రోడ్డు మరమ్మతులు చేపట్టే వరకు తన నిరసనను విరమించేది లేదంటూ ఆ వ్యక్తి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాన రహదారి కావడంతో వెంటనే గుంతలను పూడ్చి శాశ్వతంగా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌ రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ బురదలో పొర్లుతూ చేపట్టిన ఈ వినూత్న నిరసన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us