ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా.. కోవిడ్‌ తగ్గిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామన్న విద్యా మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తల్లితండ్రులు, విద్యార్థలు డిమాండ్‌తో పాటు హైకోర్టు ఆదేశాల మేరకు జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం...

ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా.. కోవిడ్‌ తగ్గిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామన్న విద్యా మంత్రి
Follow us

|

Updated on: May 02, 2021 | 5:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తల్లితండ్రులు, విద్యార్థలు డిమాండ్‌తో పాటు హైకోర్టు ఆదేశాల మేరకు జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారుచేసిన విషయం అందరికీ తెలిసినదే. కానీ 10వ తరగతి, 11–12వ తరగతి(ఇంటర్‌) పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం వల్ల… ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ లేకపోవటం వల్ల, కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారు. మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్‌లతో సర్టిఫికెట్లు వస్తాయి. మార్కులూ ర్యాంకులూ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి.

ఇంటర్‌ తరవాత పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షకు కూడా ఇంటర్‌లో కనీసం ఇంత శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ పిల్లల కెరీర్‌ అవకాశాల పరంగా చూసినా, వారి భవిష్యత్‌ ఉద్యోగాల కోసం కూడా… ఇలా ఇంటర్‌ మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్‌ కలిగి ఉన్నవారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మార్కులే వారి పైచదువులు, ఉద్యోగావకాశాల పరంగా కీలకం అవుతాయి కాబట్టే… ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో విద్యార్థులు వెనకబడకుండా చూడాల్సిన బాధ్యత ఒక మంచి ప్రభుత్వంగా మా మీద ఉంది కాబట్టే… వారి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడిందని మంత్రి చెప్పుకొచ్చారు.

పూర్తిగా కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలూ అమలు చేస్తూ… ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని భావించామని మంత్రి అన్నారు. అదీగాక, పిల్లల ప్రాక్టికల్స్‌ పూర్తి అయ్యాయి కాబట్టి, ఇక మిగిలి ఉన్న పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమే. అది కూడా రోజుకు కేవలం 3 గంటల పరీక్ష మిగిలి ఉంది.

పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం, ఇందు కోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశాం. అయినా, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని మంత్రి ఆదిమూలపు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని మంత్రి చెప్పారు. ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తామన్నారు.

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, ఈతరం విద్యార్థులు రాబోయే ప్రపంచంలో గొప్పగా నిలబడటం కోసం, ఇంటింటా చదువుల విప్లవం కోసం… ప్రభుత్వం గత 23 నెలలుగా ఎంతగా తాపత్రయపడుతోందో ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ తెలుసు. జగనన్న అమ్మ ఒడి, నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన… ఇలా అనేక పథకాలను తెచ్చి, ఈ కోవిడ్‌ సమయంలో కూడా వెనకంజ వేయకుండా అమలు చేస్తూ ఈ తరం పిల్లలు పోటీ ప్రపంచంలో తలెత్తుకుని నిలబడేందుకు, నాణ్యమైన చదువుల ద్వారా ప్రతి ఇంటిలోనూ ఆయా కుటుంబాల స్థితిగతులు గొప్పగా మార్చేందుకు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పని చేస్తున్నామని మంత్రి చెప్పారు.

కన్న బిడ్డలమీద తల్లిదండ్రులకు ఎంతటి బాధ్యత, మమకారం ఉంటుందో, మొత్తంగా రాష్ట్రంలో పిల్లలపట్ల ప్రభుత్వానికీ అంతే బాధ్యత ఉంటుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. విద్యార్థుల భవిష్యత్తును గొప్పగా నిర్మించేందుకు, కాపాడేందుకు ప్రతి ఆలోచనా ఇకమీదట కూడా చేస్తామని అన్నారు.