ఖర్జూరం తినేసి గింజలు పడేస్తున్నారా..? ఈ బెనిఫిట్స్ అన్ని మిస్ అవుతారు.. మీ ఇష్టం..!
ఖర్జూరం కంటే దాని విత్తనాలు రెట్టింపు ప్రయోజనం అంటున్నారు నిపుణులు.. ఖర్జూరం పండులాగే దాని విత్తనాలు కూడా పోషకాల నిధిగా చెబుతున్నారు. ఖర్జూరాలతో పాటు, ఖర్జూర విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మనం చెత్తగా భావించి పడవేసే ఖర్జూరం విత్తనాలతో ఎలాంటి లాభాలు ఉన్నాయి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Aug 23, 2025 | 1:25 PM

ఖర్జూర గింజల్లో ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి అవసరం. ఖర్జూర గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఖర్జూర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి, ఆకలి తగ్గుతుంది. ఖర్జూర గింజలు సిరల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు, గుండె వైఫల్యం, అరిథ్మియా మొదలైన వాటిని నివారిస్తుంది.

ఖర్జూర గింజలు కాల్షియం, భాస్వరంకు మంచి మూలం. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మూత్రపిండాలకు కూడా మేలు చేస్తాయి. ఎందుకంటే అవి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి.

ఖర్జూర విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కడుపు సులభంగా శుభ్రం అవుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. బరువు కూడా తగ్గుతారు. ఎక్కువగా వ్యాయామాలు చేసే వారు ఈ ఖర్జూర విత్తనాలను తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కండరాలలో వాపును తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి హానిని నివారిస్తాయి.

కొన్ని విత్తనాలను సేకరించి వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి, మీడియం మంట మీద పాన్ లో వేయించాలి. అవి కరకరలాడుతున్నప్పుడు, వాటిని తీసి మీ ముక్కలుగా చేసుకుని గ్రైండర్లో పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో 1 చెంచా చొప్పున తీసుకొచ్చు. లేదంటే, ఆ పొడిని నీరు లేదా తేనెతో కూడా కలిపి రోజుకు ఒకసారి తినవచ్చు.




