- Telugu News Photo Gallery Spiritual photos Mahashivratri 2023: Know All About Dwadasa Jyotirlingas In India
Maha Shivaratri: మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోండి..
అత్యంత పవిత్రమైన హిందువుల పండుగలలో ఒకటైన మహాశివరాత్రిని దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున శివుని భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందేందుకు పూజలు చేస్తారు. ప్రార్ధనలు చేస్తారు. భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాలలో శివుడు జ్యోతిర్లింగంగా పూజించబడతాడు.
Updated on: Feb 18, 2023 | 10:50 AM

ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. వీటిల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు అత్యంత విశిష్టమైనవిగా పూజిస్తారు. జ్యోతిర్లింగం ఒక సంస్కృత పదం. జ్యోతి (ప్రకాశం), లింగం (సంకేతం)అని అర్ధం. మహా శివరాత్రికి ముందు భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం..

దేశంలోని అత్యంత గౌరవనీయమైన తీర్థయాత్రలలో ఒకటి సోమనాథ్. ఇది పన్నెండు ఆది జ్యోతిర్లింగాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. శివుడు ఈ మందిరంలో వెలుగొందుతున్న స్థంభంగా దర్శనమిచ్చాడని ప్రఖ్యాతి గాంచింది. ఆలయ నిర్మాణం చాళుక్యుల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. చంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠింపబడిందని స్థలపురాణం

భీమాశంకర దేవాలయం మహారాష్ట్రలోని సహ్యాద్రి ప్రాంతంలో, భీమా నది ఒడ్డున ఉంది. వేదాల ప్రకారం.. త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు అంశంగా ఈ జ్యోతిర్లింగం సృష్టించబడింది. ఈ నది భగవంతుని చెమట బిందువులచే సృష్టించబడిందని చెబుతారు.

ఘృష్ణేశ్వర ఆలయం అజంతా, ఎల్లోరా గుహలకు సమీపంలో ఉంది. అద్భుతమైన ఎర్ర ఇసుకరాయితో ఐదు-అంతస్తులతో నిర్మించిన ఆలయం. శిఖర-శైలి వాస్తుశిల్పం, దేవతల శిల్పాలు భారీ నంది ఎద్దు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ఇది బనారస్ (వారణాసి)లోని సందడిగా ఉండే వీధుల్లో ఉంది. ఈ ఆలయంలో మరణించిన వ్యక్తులు విముక్తి పొందుతారని స్థానికులు భావిస్తారు. ఈ క్షేత్రం శివుడికి అత్యంత ఇష్టమైనదిగా విశ్వాసం. ఈ ఆలయం అనేక సార్లు పునరుద్ధరించబడినప్పటికీ, దీని ప్రాథమిక నిర్మాణం ఎప్పుడూ మార్చలేదు.

ఈ ప్రాంతాన్ని పాలించిన సత్యయుగ రాజు కేదార్ పేరు మీదుగా ఈ ఆలయానికి పేరు వచ్చింది. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో చోరాబరి గ్లేసియర్ సమీపంలో ఉంది. ఇది చార్ ధామ్ యాత్రా గమ్యస్థానాలలో ఒకటి. సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది.

ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర దేవాలయం భారతదేశంలోని మరొక జ్యోతిర్లింగం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీని చుట్టూ దట్టమైన మహాకాల అడవి ఉంది. స్వయంభూ లింగ రూపంలో మహా కాళేశ్వర దేఆలయం రుద్రా సాగర సరస్సు సమీపంలో కలదు.

భారతదేశంలోని మరొక ప్రసిద్ధ జ్యోతిర్లింగం నాగేశ్వరుడు. ఇది సౌరాష్ట్ర, గుజరాత్ ఒడ్డున ఉంది. గోమై ద్వారకా , బైట్ ద్వారక చుట్టుపక్కల ఉన్న నాగనాథ్ ఆలయం ప్రతిరోజూ భారీ సంఖ్యలో యాత్రికులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది శివపురి ద్వీపంలో ఉంది. ఓం అనే అక్షరాన్ని పోలి ఉండే ద్వీపం ఆకారాన్ని బట్టి ఓంకారేశ్వర్కు ఈ పేరు వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఒకే లింగం రెండు బాగాలుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతుంది. అమరవేశ్వరుడు, ఓంకారేశ్వరుడుగా భక్తుల నుంచి పూజలను అందుకుంటున్నాడు.

రామేశ్వరం జ్యోతిర్లింగ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాలలో ఒకటి. శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం.. రావణుడిని వధించిన అనంతరం.. ప్రాయశ్చిత్తం కోసం జ్యోతిర్లింగాన్ని అర్చించాడని హిందూ పురాణాల కథనం. రాముడు పూజించిన ఈ లింగాన్ని రామేశ్వరుడు అని పిలుస్తారు.

మల్లికార్జున దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ భాగంలో కృష్ణా నది ఒడ్డున శ్రీ శైల పర్వతం మీద ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన శైవ క్షేత్రాలలో ఒకటి. దీనిని దక్షిణ కైలాష్ అని కూడా పిలుస్తారు. మనిషిని జనన మరణాల నుంచి పాప కర్మల నుంచి విముక్తి చేయడానికి శ్రీశైలం శిఖర దర్శనం చేసుకుంటారని భక్తులు భావిస్తారు.

త్రయంబకేశ్వరాలయం బ్రహ్మగిరి పర్వతం పక్కన ఉన్న త్రయంబక్లో ఉంది. ఈ ఆలయంలోని జ్యోతిర్లింగానికి మూడు ముఖాలు ఉన్నాయి. ఈ మూడు ముఖాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడులను సూచిస్తాయని భక్తుల విశ్వాసం.

వైద్యనాథుడు లేదా బైద్యనాథుడు అని ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఈ ఆలయం జార్ఖండ్లోని దియోగర్లోని సంతాల్ పరగణాస్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఆలయంలోని స్వామిని భక్తితో పూజ చేస్తే.. అతడిని కష్టాలు నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని చాలా మంది విశ్వాసం.





























