- Telugu News Photo Gallery Spiritual photos Krishna Janmashtami 2023: Most famous Lord Krishna Temple in India to visit on sri krishnastami
Janmashtami 2023: మనదేశంలో శ్రీ కృష్ణుడి ప్రసిద్ధి దేవాలయాలు.. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించాలంటే ఆయన అనుగ్రహం ఉండాల్సిందే..
హిందువులు పూజించే ప్రధాన దేవుళ్లలో శ్రీ కృష్ణుడు ఒకరు. శ్రీ మహా విష్ణు అవతారమైన శ్రీ కృష్ణుడిని మన దేశంలో మాత్రమే కాదు సప్తసముద్రాలను దాటి పూజిస్తారు. కన్నయ్య ఆరాధనకు సంబంధించిన అతి ముఖ్యమైన పండుగ జన్మాష్టమి. శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ పవిత్రమైన రోజు శ్రీకృష్ణునికి సంబంధించిన తీర్థయాత్ర స్థలాలను సందర్శించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. భారతదేశంలో అనేక ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయాలు ఉన్నాయి. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రమే సొంత ప్రత్యేకత కలిగి ఉంది. శ్రీకృష్ణుడు బస చేసిన ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా మారాయని ప్రతీతి. దేశంలోని ప్రసిద్ధ కృష్ణ దేవాలయాల గురించి వివరంగా ఈ రోజు తెలుసుకుందాం.
Updated on: Sep 06, 2023 | 8:30 AM

ద్వారకాధీష్ ఆలయం, మధుర: మధురలోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయం. ఈ ఆలయంలో కృష్ణుడి నలుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ ఆలయం శ్రీకృష్ణుడు జన్మించిన యమునా నది ఒడ్డున ఉన్న జైలు గదిలో ఉంది. ఈ ఆలయంలోని గదిలో శ్రీకృష్ణుడు జన్మించాడని ప్రతీతి. ఈ ఆలయాన్ని ద్వారకాధీష్ దేవాలయం అని కూడా అంటారు. ఈ పవిత్రమైన ఆలయాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు మధురకు వస్తుంటారు. ఈ పురాతన ఆలయ నిర్మాణశైలి చూడదగ్గది. ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఎవరికైనా శాంతి పొందిన అనుభూతి కలుగుతుంది.

శ్రీ బాంకే బిహారీ దేవాలయం, బృందావన్: శ్రీ కృష్ణ భగవానుడు మధురలో జన్మించాడు. అయితే అతని బాల్యం బృందావనంలో గడిచింది. శ్రీ కృష్ణ భగవానుడు బంకే బిహారీ అని కూడా పిలువబడ్డాడు. అందుకే ఈ ఆలయంలోని స్వామి శ్రీ బాంకే బిహారీగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీ కృష్ణుడు తన చిన్నతనంలో బృందావనంలో మాత్రమే ఎన్నో చిలిపి చేష్టలు , రాసలీలలు చేసాడు. బృందావన్లో ఇస్కాన్ ఆలయం, ప్రేమ మందిరం, బాంకే బిహారీ ఆలయం కూడా సందర్శించదగినవి. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయాలకు భారీగా కన్నయ్య భక్తులు తరలివస్తారు.

ఉడిపి శ్రీ కృష్ణ మఠం ఆలయం, కర్ణాటక: శ్రీ కృష్ణ మఠం ఆలయం కన్నయ్య ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని వైష్ణవ సన్యాసి శ్రీ మాధవాచార్యులు 13వ శతాబ్దంలో స్థాపించారు. ఈ ఆలయ కిటికీలో ఉన్న తొమ్మిది రంధ్రాల ద్వారా భక్తులు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఈ కిటికీని అద్భుత కిటికీ అంటారు. ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి రోజున ఇక్కడికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయమంతా పూలతో, దీపాలతో అలంకరిస్తారు. దర్శనం కోసం భక్తులు 3-4 గంటల పాటు వేచి ఉండాల్సి సందర్భం కూడా ఉంటుంది.

ద్వారకాధీష్ ఆలయం, గుజరాత్: ఈ దేవాలయం గుజరాత్లోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని జగత్ మందిర్ అని కూడా అంటారు. గుజరాత్లోని ఈ ద్వారకాధీష్ దేవాలయం హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్లో ఒకటి. ఈ ఆలయం నాలుగు ధాములలో అత్యంత సుందరమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ద్వారకాధీష్ దేవాలయం గోమతి క్రీక్ (గోమతి ఘాట్) మీద ఉంది. దీనిని 43 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించకపోతే, చార్ ధామ్ యాత్ర సంపూర్ణం కానట్లు భావిస్తారు. జన్మాష్టమి రోజున ఇక్కడి ఉండే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే.

జగన్నాథ స్వామి పూరి, ఒరిస్సా: ఒడిశాలోని పరివిత్ర పుణ్యక్షేత్రం పురిలోని జగన్నాథ ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. జన్మాష్టమి కంటే ఈ క్షేత్రంలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ రథయాత్రకు హిందూ మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి, జగన్నాథుని రథాన్ని లాగడానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. జగన్నాథుడు, తన సోదరి, అన్న తో కలిసి చేసే ప్రయాణం కోసం మూడు భారీ రథాలు సిద్ధం చేస్తారు. ఈ ప్రయాణంలో బలరాముడు అధిరోహించే రథం ముందు వరుసలో ఉంటుంది.. అనంతరం సోదరి సుభద్ర రథం.. శ్రీకృష్ణుడి రథం ప్రయాణిస్తాయి.





























