- Telugu News Photo Gallery Spiritual photos Annual Brahmotsavam: TTD prepares for Garuda Seva Today as part of Brahmotsavam festival
Tirumala: బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం.. రాత్రి గరుడ సేవ, మోహిని అవతారంలో మలయప్పస్వామి దర్శనం.. జ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం
బ్రహ్మోత్సవం..అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం..తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ వైకుంఠనాథుని ఉత్సవాలను కన్నులార దర్శించి.. భక్తకోటి పులకించి పోతోంది. శ్రీవారి ఉత్సవాల్లోనే అత్యంత ప్రాధాన్యం, కీలక ఘట్టమైన గరుడ సేవకు సర్వం సిద్ధమైంది. ఆ దివ్య మంగళ రూపాన్ని దర్శించాలని తండోపతండాలుగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Updated on: Sep 22, 2023 | 6:54 AM

చూసినా భాగ్యం.. దర్శించినా జన్మధన్యం.. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవకు సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం మోహినీ అవతారంలో మలయప్ప స్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. రాత్రి గరుడ వాహనంపై భక్తులను కనువిందు చేయనున్నారు.

గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలు తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం దగ్గర ఉన్న శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చి అక్కడ పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ సెల్లదొరై, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఈవో ముత్తురాజ ఆధ్వర్యంలో ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయానికి చేర్చారు.

ఇక స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు.

జగన్నాటక సూత్రదారియై తిరువీధుల్లో ఊరేగే మలయప్ప స్వామి భక్తులందరికీ దివ్యమంగళ రూప దర్శనమిస్తాడు. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటి నమ్మకం. అందుకే గరుడ వాహనంపై విహరించే స్వామి వారిని దర్శించుకునేందుకు.. లక్షలాది మంది ఏడుకొండలు ఎక్కి శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. ఇవాళ్టి గరుడ సేవకు దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.

రాత్రి 7 గంటల నుంచి.. అర్ధరాత్రి 2 గంటల వరకు గరుడ సేవ నిర్వహించనుంది టీటీడీ. భక్తులందరికీ దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీలో వేచి ఉండే అవకాశం కల్పించింది. తిరుమలలోని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులో వేచి ఉండే భక్తులు కూడా శ్రీవారి గరుడసేవ దర్శనం చేసుకునేలా రీఫిలింగ్ సిస్టంను అమలు చేస్తోంది. ఇక గ్యాలరీల్లో ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు అందజేసేందుకు.. సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించింది టీటీడీ.

భద్రత విషయంలోనూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే 1130 టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు 3600 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదనంగా మరో 1200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పిస్తోంది. 2770 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసు ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇక తిరుపతి తిరుమల మధ్య భక్తుల రాకపోకల కోసం నిమిషానికి రెండు సర్వీసులు నడుపుతోంది ఆర్టీసీ. 439 బస్సులు.. 5456 ట్రిప్లు వేయనున్నాయి. ఏకంగా 2.20 లక్షల మంది భక్తులను కొండపైకి చేర్చేందుకు సిద్ధమైంది ఆర్టీసీ.

మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా ఘాట్ రోడ్లలో బైక్స్ కు నో ఎంట్రీ విధించింది టీటీడీ. నిన్న సాయంత్రం 6 గంటల నుంచే బైక్లకు అలిపిరి టోల్ గేట్లో నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటల తరువాతే తిరుమల ఘాట్ రోడ్డులో బైక్ లకు అనుమతి ఇవ్వనున్నారు. తిరుమలలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియాలను సిద్ధం చేసింది. గరుడ సేవను తిలకించేందుకు వీలుగా మాడవీధులు, భక్తుల రద్దీ ఉండే ప్రాంతాల్లో 20 పెద్ద డిజిటల్ స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే మొబైల్ క్లినిక్లు, అంబులెన్స్లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచింది.

స్వామి వారి వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవగా భక్తులకు భావిస్తారు. ఈ వాహన సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని. జ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం.




