- Telugu News Photo Gallery Mango Festival: Andhra Unique Tribal Celebration of Nature and Harvest in Agency Areas
ఘనంగా మామిడి కాయల పండుగ.. దీని ప్రత్యేకత తెలుసా?
ఏలూరు: దసరా, సంక్రాంతి, దీపావళి వంటి పండుగలు అందరికీ తెలిసిందే. కానీ “మామిడికాయల పండుగ” గురించి చాలామందికి తెలియదు. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అత్యంత భక్తి, సంప్రదాయబద్ధంగా జరుపుకునే విశిష్టమైన ప్రకృతి పండుగ ఇదే.
Updated on: May 21, 2026 | 1:18 PM

అడవిని నమ్ముకుని జీవించే గిరిజనుల జీవనశైలి ప్రకృతితో మమేకమై ఉంటుంది. వారు తినే ప్రతి పండు, పంటను ముందుగా ప్రకృతికి, గ్రామ దేవతలకు సమర్పించిన తర్వాతే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో మామిడి సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునేదే “మామిడికాయల పండుగ”.అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, సీతంపేట, బుట్టాయగూడెం, పోలవరం వంటి ఏజెన్సీ మండలాల్లో ఈ పండుగ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కొండరెడ్లు, బగత, కొండదొర, వాల్మీకి, మాలి, సవర తదితర గిరిజన తెగలు చెట్టుకు మామిడికాయలు కాసినా, పండినా,ఈపండుగ పూర్తయ్యే వరకు వాటిని కోయరు, తినరు.

గిరిజనుల విశ్వాసం ప్రకారం అడవి తల్లి, కొండ దేవతలు, గ్రామ దేవతల అనుగ్రహంతోనే పంటలు బాగా పండుతాయని, గ్రామం సుభిక్షంగా ఉంటుందని భావిస్తారు. అందుకే తొలి మామిడి కాయలను దేవతలకు నైవేద్యంగా సమర్పించి తర్వాతే వాటిని ఆహారంగా స్వీకరిస్తారు. సాధారణంగా ఉగాది తర్వాత వచ్చే చైత్ర మాసంలో, అంటే మార్చి-ఏప్రిల్ మధ్య ఈ పండుగ జరుగుతుంది. గ్రామ పెద్దలు, పూజారులు, గురువులు కలిసి పండుగ తేదీ నిర్ణయిస్తారు. పండుగకు ముందు గిరిజనులు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, ఆవు పేడతో అలికి, అడవి నుంచి తెచ్చిన రంగు మట్టితో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి పండుగకు సిద్ధమవుతారు. బయట ప్రాంతాల్లో పనిచేసేవారు కూడా ఈ వేడుక కోసం స్వగ్రామాలకు చేరుకుంటారు.

పండుగ రోజు ఉదయం గ్రామస్తులంతా దట్టమైన అడవిలోకి వెళ్లి వెదురు పొదల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురువులు నేలను శుభ్రపరచి పసుపు కట్టి, నైవేద్యాలు సమర్పిస్తారు. తమ ఆచార ప్రకారం గ్రామ దేవతలను ఆవాహన చేసి గ్రామానికి కాపాడమని ప్రార్థిస్తారు. బెజవాడ దుర్గమ్మ, భీమవరం పెద్దింట్లమ్మ, గుబ్బల మంగమ్మ, పోలవరం గండిపోచమ్మ వంటి దేవతలను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. తాజాగా కోసుకొచ్చిన మామిడికాయలతో పాటు కోళ్లు, మేకలు, గొర్రెలను సంప్రదాయబద్ధంగా బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం గ్రామానికి తీసుకొచ్చిన మాంసంతో సామూహిక విందులు ఏర్పాటు చేస్తారు. కొత్త బియ్యం, అటవీ ఉత్పత్తులతో ప్రత్యేక వంటలు చేసి ఊరంతా కలిసి భోజనం చేస్తారు. ముఖ్యంగా మామిడి కాయలతో తయారుచేసే వంటకాలు ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ పండుగ కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాదు. ఇది గిరిజన సంస్కృతి, ఐక్యత, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది. సాయంత్రం తర్వాత గిరిజన యువతీ యువకులు, వృద్ధులు అందరూ కలిసి సంప్రదాయ వాయిద్యాలైన తప్పెట, డోలు, కొమ్ము వాయిస్తూ థింసా నృత్యాలు చేస్తారు. తమ మాతృభాషలో ప్రకృతిని, దేవతలను కీర్తిస్తూ పూర్వీకుల గాథలను ఆలపిస్తూ రాత్రంతా సంబరాలు కొనసాగిస్తారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే ఈ మామిడికాయల పండుగ ప్రకృతి పట్ల గిరిజనులు చూపే కృతజ్ఞతకు ప్రతీక. చెట్టును దేవుడిగా భావించి, అది ఇచ్చిన ఫలాన్ని ప్రసాదంగా స్వీకరించే వారి జీవన విధానం ఆధునిక సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తోంది. యాంత్రిక జీవనంలో బంధాలను మరిచిపోతున్న నేటి కాలంలో ఊరంతా ఒక కుటుంబంలా కలిసి జరుపుకునే ఈ పండుగ గిరిజన సంస్కృతి గొప్పదనాన్ని మరోసారి చాటిచెబుతోంది.
