- Telugu News Photo Gallery Cricket photos Sanju samson timeline team india captains ms dhoni to shreyas iyer
Sanju Samson: సంజూ పాలిట 7గురు విలన్లు.. 11 ఏళ్ల కెరీర్లో ఎవరెన్నిసార్లు హ్యాండిచ్చారో తెలుసా?
Sanju Samson Career Timeline: ధోనీ, కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ నుంచి నేటి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వరకు... భారత జట్టుకు ఎంతమంది నాయకులు మారినా సంజూ శాంసన్ తలరాత మాత్రం మారలేదు. ప్రపంచకప్ గెలిపించిన హీరోను సైతం రెండు మ్యాచ్ల ఫామ్ ఆధారంగా పక్కనపెట్టడం సెలెక్టర్ల అనాలోచిత నిర్ణయాలకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఈ కేరళ స్టార్కు స్థిరమైన అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
Updated on: Jul 07, 2026 | 7:43 AM

Sanju Samson Career Timeline: భారత క్రికెట్లో అత్యంత ప్రతిభ ఉండి కూడా నిరంతరం వివక్షకు గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది సంజూ శాంసన్ మాత్రమే. జట్టులో చోటు కోసం అతను ఎంత శ్రమించినా, ఎన్ని పరుగులు చేసినా చివరికి బెంచ్కే పరిమితం కావడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ అతనికి చోటు దక్కకపోవడం హాట్ టాపిక్గా మారింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో సంజూ శాంసన్ను తుది జట్టు నుంచి తప్పించడం తీవ్ర వివాదానికి దారితీసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉన్నప్పటికీ, సీనియర్ ఆటగాడైన సంజూను పక్కన పెట్టడంపై సెలెక్టర్ల వైఖరిని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రతిభను పక్కనపెట్టి ఫామ్, జట్టు కాంబినేషన్ల పేరుతో అతనికి పదే పదే అన్యాయం చేయడం ఆనవాయితీగా మారింది.

అజింక్య రహానే సారథ్యంలో అరంగేట్రం.. ఐదేళ్ల నిరీక్షణ..: సంజూ శాంసన్ ప్రస్థానం ఎందరో యువ క్రికెటర్లకు ఒక గుణపాఠం. కేవలం 21 ఏళ్ల వయసులోనే, 2015లో అజింక్య రహానే నాయకత్వంలో జింబాబ్వేపై సంజూ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో 19 పరుగులు చేసిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్, ఆ తర్వాత మరో మ్యాచ్ ఆడటానికి ఏకంగా ఐదేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నా జాతీయ జట్టు తలుపులు మాత్రం అతనికి మూసుకుపోయాయి.

ధోనీ, కోహ్లీ యుగంలో దక్కని అవకాశాలు..: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా ఉన్న సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలతో కూడిన టాప్ ఆర్డర్ బలంగా ఉండటం, కీపర్గా కేఎల్ రాహుల్కే ప్రాధాన్యత ఇవ్వడంతో సంజూకు బెంచ్ దాటే అవకాశం దక్కలేదు. అనంతరం విరాట్ కోహ్లీ - రవిశాస్త్రి జోడీ హయాంలో 2020లో జట్టులోకి వచ్చినా, ఆరు మ్యాచ్ల్లో కేవలం 64 పరుగులు మాత్రమే చేయడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ సంజూ రాత మారలేదు. 2022 వన్డేల్లో 71 సగటుతో రాణించినా ఆ ఏడాది టీ20 ప్రపంచకప్కు అతన్ని ఎంపిక చేయలేదు. ఇక 2024లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సంజూ సభ్యుడైనప్పటికీ, టోర్నీలో ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం ఇవ్వకపోవడం అతని దురదృష్టానికి పరాకాష్ట.

సూర్యకుమార్ హయాంలో సంచలనం.. మళ్లీ పతనం..: హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ, గౌతమ్ గంభీర్ కోచింగ్లో సంజూ కెరీర్ మలుపు తిరిగింది. దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు బాది టీ20ల్లో ఓపెనర్గా తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ, 2025 ఆసియా కప్లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్లను ఓపెనర్లుగా పంపి సంజూను మిడిల్ ఆర్డర్కు మార్చడంతో అతని బ్యాటింగ్ లయ దెబ్బతింది. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లోనూ ఐదు ఇన్నింగ్స్ల్లో కేవలం 46 పరుగులే చేయడంతో మళ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు.

2026 ప్రపంచకప్ హీరో.. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మళ్లీ షాక్..: 2026 టీ20 ప్రపంచకప్ ఆరంభంలో సంజూను బెంచ్కే పరిమితం చేశారు. అయితే స్పిన్ను ఎదుర్కోవడంలో భారత్ తడబడుతున్న వేళ జట్టు యాజమాన్యం సంజూను రంగంలోకి దించింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా వాడుకున్న అతను, కేవలం 5 ఇన్నింగ్స్ల్లో 320కి పైగా పరుగులు చేసి, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో అద్భుత హాఫ్ సెంచరీలతో భారత్ను విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును కూడా గెలుచుకున్నాడు.

కానీ, ఇంతటి ఘన విజయం తర్వాత కూడా అతనికి కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో 5 పరుగులకే పరిమితం కావడం, ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20లో కేవలం 1 పరుగుకే అవుట్ కావడంతో, రెండో టీ20 మ్యాచ్ నుంచి సంజూను మళ్లీ తుది జట్టు నుంచి తొలగించారు.
