Hyderabad: చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఎందుకంటే?
అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఏం జరిగిందో, ఎంత కష్టం వచ్చిందో తెలియదు.. సొంతూరుకు వెళ్లిన తల్లిదండ్రులకు, చెల్లికి మిస్ యూ అంటూ మెసేజ్ చేశాడు. ఆ కాసేపటికి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తల్లిదండ్రులు, చెల్లికి మిస్యూ అంటూ మెసేజ్ చేసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రేగు మహేశ్ అనే 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంతో కలిసి బోడుప్పల్ శ్రీ సాయిరామ్ నగర్లో నివాసం ఉంటున్నాడు. అతను ప్రస్తుతం బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం తల్లిదండ్రులు, చెల్లి తమ సొంతూరుకు వెళ్లడంతో ఇంట్లో మహేశ్ ఒక్కడే ఉన్నాడు.
ఏం జరిగిందో తెలియదు కానీ.. ఉన్నట్టుండి మహేశ్ తల్లిదండ్రులతో పాటు తనను కూడా మిస్ అవుతున్నానంటూ చెల్లికి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసిన చెల్లికి అనుమానం వచ్చింది. వెంటనే మహేశ్కు ఫోన్ చేసినప్పటికీ అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో కంగారు పడిన చెల్లి.. తమ సమీప బంధువైన గిరిబాబుకు విషయం చెప్పి ఇంటికి పంపించింది.
అయితే ఇంటికి చేరుకున్న గిరిబాబు తలుపు తెరిచి చూడగా.. బెడ్రూమ్లోని ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో మహేశ్ కనిపించాడు. అది చూసిన గిరి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని అతని చెల్లి, కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేశ్ ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
