AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad: వాయనాడ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? పశ్చిమ కనుమలు..కేరళపై పగబట్టాయా..?

కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో.. అన్వేషణ, సహాయక చర్యలు యుద్దప్రాతిపదినక కొనసాగు తున్నాయి. బురద, శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారికోసం..రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ జల ప్రళయానికి.. మానవుడి అత్యాశ, ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటున్నారు..పర్యావరణ వేత్తలు. వయనాడ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? పశ్చిమ కనుమలు..కేరళపై పగబట్టాయా..? కేరళలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఊళ్లకు ఊళ్లనే నాశనం చేశాయి. వాయనాడ్‌లో ఇటీవల సంభవించిన ఘటనలో 295 […]

Wayanad: వాయనాడ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? పశ్చిమ కనుమలు..కేరళపై పగబట్టాయా..?
Wayanad
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 01, 2024 | 7:55 PM

కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో.. అన్వేషణ, సహాయక చర్యలు యుద్దప్రాతిపదినక కొనసాగు తున్నాయి. బురద, శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారికోసం..రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ జల ప్రళయానికి.. మానవుడి అత్యాశ, ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటున్నారు..పర్యావరణ వేత్తలు. వయనాడ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? పశ్చిమ కనుమలు..కేరళపై పగబట్టాయా..?

కేరళలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఊళ్లకు ఊళ్లనే నాశనం చేశాయి. వాయనాడ్‌లో ఇటీవల సంభవించిన ఘటనలో 295 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా..అనేక మంది ఆ శిథిలాల కిందే చిక్కుకుపోయారు. కనీవినీ ఎరుగని ఈ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విడుదల చేసింది. అక్కడ సంభవించిన విలయాన్ని 3డీ రూపంలో చూపించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 86వేల చదరపు మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో అంచనా వేసింది. సముద్రమట్టానికి 1,550 మీటర్ల ఎత్తులో ఈ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది. వాయనాడ్‌లో చోటుచేసుకున్న భారీ వినాశనాన్ని అంచనా వేసేందుకు..కార్టోశాట్‌-3 శాటిలైట్‌తో పాటు ఆ ప్రాంతంలో అంతరిక్షం నుంచి తీసిన 3డీ చిత్రాలను ఇస్రో విశ్లేషించింది. గతంలోనూ అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన విషయాన్ని ఈ చిత్రాల్లో వివరించింది. కేరళలో గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాయనాడ్‌ ప్రాంతం మొత్తం తడిగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు.

వాయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయాయి. ముండక్కైలో 150 వరకు ఇళ్లు ఉండగా.. వాటిల్లో 65 పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. శిథిలాలను తొలగిస్తే గానీ లోపల ఎంత మంది ఉన్నారనేది తెలియదని సహాయక బృందాలు చెబుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన భారత సైన్యం దాదాపు వెయ్యిమందికిపైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలను నిర్మించారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన వీటిని.. బెయిలీ వంతెనలంటారు.

వాయనాడ్‌లోని బాధిత ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటించారు. కొండచరియలు విరిగిపడ్డ చురాల్‌మాల ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరాతీశారు. రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ ఎంపీ , నేతలు కూడా కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాహుల్‌గాంధీ. కేంద్రం కూడా కేరళకు అండగా ఉండాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న వరదబాధితులను కూడా కలిశారు..రాహుల్‌ , ప్రియాంక. అటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా వయనాడ్ వెళ్లి విపత్తు పరిస్థితిపై సమీక్షించారు.

మరోవైపు మానవ చర్యల వల్లే కేరళలో తరచూ ఇలాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయంటున్నారు..పర్యావరణ వేత్తలు. కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రంతో పాటు తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు.. విస్తరించి ఉన్నాయి. వీటిని ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. దాంతో ఎకో టూరిజం పేరుతో హోటళ్లు, రిసార్టుల నిర్మాణం భారీగా జరుగుతోంది. ఇందుకోసం అడవులను కూడా విచ్చలవిడిగా నరికేస్తున్నారు. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ పరిణామాలతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు కేరళను ముంచెత్తాయి. ఇప్పుడు వాయనాడ్‌ విధ్వంసం..కోలుకోలేని దెబ్బతీసింది.

కేరళలోని వాయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై ఇటీవల నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ. గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే. దేశవ్యాప్తంగా 3 వేల 782 ఘటనలు జరిగితే..వాటిలో కేరళలోనే 2 వేల 239 ఘటనలు జరిగాయి. పర్యావరణ విధ్వంసంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే..వయనాడ్‌ ఘటనలు నిత్యకృత్యంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు..పర్యావరణ వేత్తలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…