కష్టార్జితంతో చదివించి ఎస్ఐని చేస్తే.. కట్నం కోసం వేధిస్తున్నారంటూ.. కేసు పెట్టిన భార్య!
ఈ సమాజంలో ఆదర్శ దంపతులు అని చెప్పుకునేలా సంసారాన్ని చక్కగా పండించుకునే భార్యాభర్తలు చాలా అరుదుగా ఉంటారు. భార్యను చదివించి సబ్ ఇన్స్పెక్టర్ని చేసిన ఓ భర్త మన మధ్యే ఉన్నాడంటే ప్రశంసించకుండా ఉండలేం కదూ..! పెళ్లయిన తర్వాత చదువు, ఉద్యోగం ఎందుకని కట్టడి చేసే భర్తలున్న నేటి కాలంలో.. ఆమె ఇష్టాలు తెలుసుకుని, కష్టపడి చదివించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టిన పురుషులు ఇంకా ఉన్నారంటే చేతులెత్తి దండాలు పెట్టాల్సిందే..!

ఈ సమాజంలో ఆదర్శ దంపతులు అని చెప్పుకునేలా సంసారాన్ని చక్కగా పండించుకునే భార్యాభర్తలు చాలా అరుదుగా ఉంటారు. భార్యను చదివించి సబ్ ఇన్స్పెక్టర్ని చేసిన ఓ భర్త మన మధ్యే ఉన్నాడంటే ప్రశంసించకుండా ఉండలేం కదూ..! పెళ్లయిన తర్వాత చదువు, ఉద్యోగం ఎందుకని కట్టడి చేసే భర్తలున్న నేటి కాలంలో.. ఆమె ఇష్టాలు తెలుసుకుని, కష్టపడి చదివించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టిన పురుషులు ఇంకా ఉన్నారంటే చేతులెత్తి దండాలు పెట్టాల్సిందే..! అలాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న భర్తపైనే ఇప్పుడు వరకట్న వేధింపులకు సంబంధించి కేసు నమోదైంది. తన భర్త తనను కట్నం కోసం వేధిస్తున్నాడని స్వయానా అతని భార్యే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిజానిజాలు ఏంటో దర్యాప్తు మొదలుపెట్టారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ నగర్ కోత్వాలీ పరిధిలోని గణేశ్పురా ప్రాంతానికి చెందిన గుల్షన్తో పాయల్ రాణి అనే మహిళ వివాహం 2022, డిసెంబర్ 2న జరిగింది. అయితే.. చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు గనే పాయల్ రాణికి భర్త గుల్షన్ సహకారం తోడైంది. భార్యను చదివించి, తన కష్టార్జిత డబ్బులతో చదువు ఖర్చులు భరించి సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చే వరకు గుల్షన్ పాటుపడ్డాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. ప్రస్తుతం బరేలీ జిల్లాలో మహిళా సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పాయల్ రాణి.. తన భర్త వరకట్నం కోసం తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ హాపూర్ ఎస్పీకి చేసిన ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు 2025 నవంబర్ 13న పాయల్ రాణి భర్త గుల్షన్తో పాటు అతని కుటుంబానికి చెందిన ఆరుగురిపై హాపూర్ నగర్ కోత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుల్షన్ తనను కట్నం కోసం డిమాండ్ చేస్తున్నాడని, తనను పలుమార్లు వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు.. ఈ వ్యవహారంలో న్యాయమైన, నిష్పక్షపాత దర్యాప్తు చేయాలంటూ భర్త గుల్షన్ హాపూర్ ఎస్పీ కుంవర్ జ్ఞానంజయ్ సింగ్ను ఆశ్రయించాడు.
పెళ్లి సమయంలో తమ కుటుంబం సామర్థ్యానికి మించి కట్నం ఇచ్చినా, అత్తింటివారు సంతృప్తి చెందలేదని పాయల్ రాణీ ఆరోపించారు. పెళ్లి తర్వాత భర్త గుల్షన్, అత్తమామలు, ఇతర బంధువులు అదనంగా కట్నం తేవాలని వేధించడం ప్రారంభించారని పేర్కొంది. రూ.10 లక్షల నగదుతో పాటు ఓ కారును డిమాండ్ చేశారని, వాళ్లు అడిగినట్లుగా కట్నం తేకపోవడంతో తనపై మానసికంగా, శారీరకంగా వేధింపులు పెరిగాయని చెప్పుకొచ్చారు. పలుమార్లు తనపై తీవ్రంగా దాడి చేశారని, చివరికి యాసిడ్ కూడా పోస్తామని బెదిరించారని ఆరోపించారు. ఈ బెదిరింపుల వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని పాయల్ రాణి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. ఈ ఆరోపణలను భర్త గుల్షన్ ఖండించాడు. తాను, పాయల్ రాణి 2016 నుంచే ప్రేమలో ఉన్నామని, ఇద్దరూ కలిసి చదువుకున్న సమయంలో పరిచయం ఏర్పడిందని గుల్షన్ తెలిపాడు. 2021లో కోర్టులో మ్యారేజ్ చేసుకున్నామని, ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి 2022లో ఎలాంటి కట్నం లేకుండా సంప్రదాయ వివాహం జరిగిందని చెప్పారు. తన భార్య పాయల్ రాణిని చదివించి, తన కష్టార్జిత డబ్బులతో చదువు ఖర్చులు భరించి సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చేవరకు పూర్తి సహకారం అందించానని గుల్షన్ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదే పాయల్ రాణి తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నమోదు చేయించిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో హాపూర్ ఎస్పీ కుంవర్ జ్ఞానంజయ్ సింగ్ను కలిసి, న్యాయమైన, పారదర్శక విచారణ జరిపించాలని గుల్షన్ విజ్ఞప్తి చేశాడు. నిజానిజాలు సమగ్ర దర్యాప్తు తర్వాతే బయటపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు ఈ కేసులో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణపై ప్రత్యేక దృష్టి సారించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
