Tariff Row: ట్రంప్కు మోదీ బిగ్ కౌంటర్.. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత..
టారీఫ్లతో బెదిరింపులకు పాల్పడుతున్న అమెరికాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపేసింది. అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలే తీసుకున్నారు.

టారీఫ్లతో ట్రంప్ వివిధ దేశాలపై విరుచుకపడుతున్నారు. ఇదే క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై తొలుత 25శాతం టారీఫ్ విధించారు. ఆ తర్వాత దానిని 50 శాతానికి పెంచారు. ఇది ఇంటా బయట చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైందంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. దేశ ప్రయోజనాల కోసం భారత్ అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చిత వల్లే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో విపక్షాలు సైతం కేంద్రం తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ విమర్శలు గుప్పించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అగ్రరాజ్యానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో అమెరికాకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపివేసింది. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. యుద్ధ విమానాలతో పాటు క్షిపణుల కొనుగోళ్లకు బ్రేక్ వేసింది. కాగా ఎఫ్ 35 ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయనందుకే అమెరికా టారీఫ్లతో విరుచుకపడిందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నిర్ణయం అమెరికాకు బిగ్ షాక్గా చెప్పొచ్చు. దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
అంతేకాకుండా కేబినెట్లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక ఏడాదికి గానూ ఈ పథకం కోసం రూ.12వేల కోట్లు కేటాయించింది. అదేవిధంగా సాంకేతిక విద్యాసంస్థల అభివృద్ధికి MERITE పథకానికి ఆమోదం తెలిపింది. దీన్ని కోసం రూ.4200 కోట్లు కేటాయించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




