త్రిపుర సీఎం విప్లవ్దేవ్కు అసమ్మతి సెగ!
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్దేవ్ కుమార్కు అసమ్మతి సెగ తగులుతోంది.. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో రెండేళ్ల కిందట బీజేపీ అధికారంలోకి వచ్చింది.. ఆనాటి నుంచి విప్లవ్కుమార్ దేవే సీఎంగా ఉన్నారు..
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్దేవ్ కుమార్కు అసమ్మతి సెగ తగులుతోంది.. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో రెండేళ్ల కిందట బీజేపీ అధికారంలోకి వచ్చింది.. ఆనాటి నుంచి విప్లవ్కుమార్ దేవే సీఎంగా ఉన్నారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో విప్లవ్కుమార్ దిట్ట.. అదే పార్టీని కొంపముంచుతుందని అంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీ అప్రతిష్టపాలవుతున్నదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న కొందరు ఎమ్మెల్యేలు అధినాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నది మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బార్మన్. ఇప్పటికే ఈయన 12 ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కున్నారు. వీరంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకుని విప్లవ్కుమార్ మీద కంప్లయింట్ చేయాలనుకుంటున్నారు. అవకాశం ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలను కూడా కలిసి వెళ్లాలనే భావనతో ఉన్నారు. ఢిల్లీలోని త్రిపుర భవన్లో బస చేస్తున్న ఎమ్మెల్యేలు నడ్డా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాము దాదాపు 12 మంది ఎమ్మెల్యేలమున్నామని, రాష్ట్రంలో నెలకొన్న నియంతృత్వ పాలన గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నామని ఓ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో పార్టీ పరువుపోతున్నదని అన్నారు.. విప్లవ్కుమార్కు పాలన చేతకావడం లేదని ఆరోపించారు. విప్లవ్కుమార్ దేవ్ వ్యాఖ్యల కారణంగా చాలాసార్లు పార్టీ ఇబ్బందులకు గురయ్యింది.. త్రిపురలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది.. ఇప్పుడు తమ రాష్ట్ర ఆరోగ్యశాఖకు మంత్రి అనేవారే లేరని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అంటున్నారు. వెంటనే త్రిపురకు ఓ కేంద్ర బృందాన్ని పంపించాలని నడ్డాను వేడుకుంటామని చెప్పారు. సీఎం నియంతృత్వ ధోరణితో విసుగు చెందిన అనేక మంది ఐపీఎస్, ఐఎఎస్ అధికారులు డిప్యూటేషన్పై రాష్ట్రాన్ని వీడుతున్నారని, కొందరు స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుంటున్నారని తెలిపారు. మీడియాపై కూడా విప్లవ్ పలుమార్లు నోరు పారేసుకున్నారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నరని అన్నారు. విప్లవ్కుమార్ దేవ్ అనుచరులు మాత్రం తిరుగుబాటు ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్నారు.. రాష్ట్రంలో పాలన భేషుగ్గా ఉందని, కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం చక్కటి చర్యలు చేపట్టందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఏడేనిమిది మంది ఎమ్మెల్యేలే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు, నాయకులు విప్లవ్దేవ్ నాయకత్వంపై పూర్తి నమ్మకాన్ని కనబరుస్తున్నారని అన్నారు.