Congress Meeting: రాహుల్ పగటికలలు కంటున్నారు.. ఖర్గే అధ్యక్షతన సమావేశంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సెటైర్లు..
కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ అదే ఊపును కొనసాగించాని నిర్ణయించింది. మధ్యప్రదేశ్ నేతలతో సమావేశమైన రాహుల్ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే రాహుల్ పగటికలలు కంటున్నారని కౌంటర్ ఇచ్చారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత జోష్ మీద ఉన్న కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోంది. ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాహుల్గాంధీ,కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది చివరల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్నాథ్ , దిగ్విజయ్సింగ్తో రాహుల్ భేటీ అయ్యారు. కర్నాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే మధ్యప్రదేశ్లో రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే రైతులకు రుణమాఫీ , ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ నేతలతో సమావేశం తరువాత రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు మధ్యప్రదేశ్లో రిపీట్ అవుతాయన్నారు రాహుల్. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు 150కి పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించాం. మాకు కర్నాటకలో 136 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్లో మాకు 150 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. కర్నాటక విజయం ఎంపీలో రిపీట్ కానుంది. మాకు తప్పకుండా మధ్యప్రదేశ్లో 150 సీట్లు వస్తాయి. అయితే రాహుల్ వ్యాఖ్యలకు ఘాటైన కౌంటరిచ్చారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్.
రాహుల్గాంధీ పగటికలలు కంటున్నారని , బీజేపీకి ఎన్నికల్లో 200కు పైగా సీట్లు వస్తాయన్నారు శివరాజ్సింగ్ చౌహాన్. ఆత్మతృప్తికి ఆయన అలా మాట్లాడుతున్నారు. బీజేపీ మధ్యప్రదేశ్లో 200కు పైగా సీట్లలో విజయం సాధిస్తుంది. ఆయన కలలో పులావ్ వండుతున్నారు. అలా వండితే మాకు అభ్యంతరం లేదు. రాజస్థాన్లో కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్ మధ్య రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం