Presidential elections 2022: రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న ముర్ము.. కోలాహలంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇల్లు..
Presidential elections 2022: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల సందడి వాతారణం నెలకొంది. ముఖ్యంగా ఇవాళ ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్..
Presidential elections 2022: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆమెను.. ఢిల్లీ ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, వీరేంద్ర కుమార్, బీజేపీ నేత మనోజ్ తివారీ రిసీవ్ చేసుకున్నారు. ఇక బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకుని ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంతో.. ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వివిధ పార్టీల నాయకులను కూడా ఆమె మద్దతు కోరనున్నారు.
కోలాహలంగా ప్రహ్లాద్ జోషి ఇల్లు..
ఇకపోతే.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇల్లు కేంద్రంగా నడుస్తోంది. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రదిపాదించే వారు, ఆమెకు మద్ధతు తెలిపే ఎన్డీయే మిత్రపక్షాలు, ఇతర పార్టీల నేతలంతా ప్రహ్లాద్ జోషి ఇంటికి తరలి వచ్చారు. ద్రౌపది ముర్ము నామినేషన్ పత్రాలపై 100 మంది ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ నేతల రాకతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇల్లు కోలాహలంగా మారింది. ప్రహ్లాద్ జోషి ఇంటి నుంచే ఆమె నామినేషన్ వేసేందుకు బయలుదేరుతారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వానికి మద్ధతు తెలిపే నేతలంతా జోషి ఇంటికి తరలివస్తున్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
1958లో జన్మించిన ద్రౌపది ముర్ము గిరిజన సమాజానికి చెందిన నాయకురాలు. సొంత రాష్ట్రం ఒడిశా. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే భాతర తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్రకెక్కుతారు. జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన తొలి గిరిజన మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు. నవీన్ పట్నాయక్ బీజేపీ మద్దతుతో ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో రాష్ట్ర కేబినేట్ మంత్రిగా కూడా ముర్ము పనిచేశారు. ఒడిశా నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంతో నవీన్ పట్నాయక్ సైతం ముర్ము అభ్యర్థిత్వానికే మద్దతు ఇస్తున్నారు.
విపక్షాల అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న యశ్వంత్ సిన్హా..
ఇదిలాఉంటే.. ఇవాళ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన మద్దతుదారులంతా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంకాలు చేశారు. ఇవాళ నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు.
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు..
జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, 21న కౌంటింగ్ జరుగుతుంది. నామినేషన్లు జూన్ 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జులై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24వ తేదీతో ముగియనుంది.