టాటా సన్ చైర్మన్ టాక్…. కరోనా తర్వాత పెరిగిన అవకాశాలు… అందిపుచ్చుకోవడమే తరువాయి….
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న మాట వాస్తవమని, అయితే అంతే స్థాయిలో అవకాశాలు పెరిగాయని టాటా సన్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న మాట వాస్తవమని, అయితే అంతే స్థాయిలో అవకాశాలు పెరిగాయని టాటా సన్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఫిక్కీ 93వ వార్షికోత్సవ వెబ్నార్లో పాల్గొని మాట్లాడారు. 2020 భారత్కు చెందుతుందని, ఎందుకంటే కరోనా కాలంగా అమెరికా, చైనా వంటి దేశాలు తీవ్రంగా నష్టపోయాయని, అంతర్జాతీయంగా ఈ పరిణామం భారత్కు కలిసి వస్తుందని అన్నారు.
అయితే ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థ కలిసి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. భారత దేశంలో అత్యధికంగా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకోవాలని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధికి కేంద్రం కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా సాంకేతికతను పెంపొందించే చర్యలు అటు ప్రభుత్వం, ఇటు వ్యాపార సంస్థల నుంచి రావాలని కోరారు.
సాంకేతిక విప్లవం….
ప్రపంచాన్ని సాంకేతిక విప్లవం శాసిస్తోందని చంద్రశేఖరన్ అన్నారు. కృతిమ మేధ, మొబైల్ టెక్నాలజీ ఈ రెండు రంగాలు ఇప్పుడు వృద్ధిలో ఉన్నాయని తెలిపారు. వాటికి అనుగుణంగా భారత్ తన శక్తి, సామర్థ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందుతుందని అన్నారు.
అంతేకాకుండా 21 శతాబ్దాన్ని భారత్ ప్రభావితం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే పరిశ్రమలు, వ్యాపార వృద్ధికి అవసరమైన స్థలాలు, సాంకేతికత, సబ్సిడీలు, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించాలని సూచించారు. తద్వారా వ్యాపార అభివృద్ధి జరిగి దేశ జీడీపీ సైతం పెరుగుతుందని, దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందని వివరించారు.