AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Education Convention: అఖిల భారతీయ శిక్ష సమాగం ప్రారంభం.. చిన్నారులతో సరదాగా గడిపిన ప్రధాని..

జాతీయ విద్యా విధానం 2020 3 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో అఖిల భార‌తీయ శిక్షా స‌మాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘PM SHRI’ పథకం కింద మొదటి విడత నిధులను కూడా విడుదల చేశారు. ఈ పథకం కింద 6,207 పాఠశాలలు మొదటి విడతగా మొత్తం రూ. 630 కోట్లు పొందాయి.

India Education Convention: అఖిల భారతీయ శిక్ష సమాగం ప్రారంభం.. చిన్నారులతో సరదాగా గడిపిన ప్రధాని..
Pm Narendra Modi
Shiva Prajapati
|

Updated on: Jul 29, 2023 | 5:24 PM

Share

న్యూఢిల్లీ, జులై 29: జాతీయ విద్యా విధానం 2020 3 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో అఖిల భార‌తీయ శిక్షా స‌మాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘PM SHRI’ పథకం కింద మొదటి విడత నిధులను కూడా విడుదల చేశారు. ఈ పథకం కింద 6,207 పాఠశాలలు మొదటి విడతగా మొత్తం రూ. 630 కోట్లు పొందాయి. అలాగే 12 భారతీయ భాషలలోకి అనువదించబడిన విద్య, నైపుణ్య పాఠ్యప్రణాళిక పుస్తకాలను కూడా విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని తిలకించారు.

స‌మావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మోదీ ప్రసంగిస్తూ, దేశం గతిని, అదృష్టాన్ని మార్చే అంశాల‌లో విద్య ప్రాధాన్యత‌ను నొక్కి చెప్పారు. 21వ శతాబ్దపు భారతదేశం ముందుకు సాగుతున్న లక్ష్యాలను చేరుకోవడంలో మన విద్యావిధానం పెద్ద పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అఖిల భారతీయ శిక్షా సమాగం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి.. విద్యకు చర్చ, సంభాషణలు ముఖ్యమని అన్నారు. వారణాసిలో కొత్తగా నిర్మించిన రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో గత అఖిల భారతీయ శిక్షా సమాగం జరగడం, ఈ సంవత్సరం అఖిల భారతీయ శిక్షా సమాగం సరికొత్త భారత్ మండపంలో జరగడం యాదృచ్ఛికంగా జరిగిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

కాశీ రుద్రాక్ష నుండి ఆధునిక భారత మండపం వరకు.. ప్రాచీన, ఆధునికతల సమ్మేళనం అఖిల భారతీయ శిక్షా సమాగం ప్రయాణంలో అంతర్లీన సందేశం ఉందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. భారతదేశ విద్యా వ్యవస్థ ఒకవైపు ప్రాచీన సంప్రదాయాలను పరిరక్షిస్తూనే మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. విద్యారంగంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతికి తోడ్పడిన వారిని ప్రధాని మోదీ అభినందించారు. ఇవాళ జాతీయ విద్యా విధానం 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. దీనిని ఒక మిషన్‌గా తీసుకుని, తమ సేవలందించిన మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన ఎగ్జిబిషన్‌ గురించి మాట్లాడుతూ.. నైపుణ్యాలు, విద్య, వినూత్న పద్ధతుల ప్రదర్శనను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. మన దేశంలో చిన్న పిల్లలు తాము గడిపిన సరదా అనుభవాల ద్వారా నేర్చుకుంటున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు.. ఈ ఎగ్జిబిషన్‌ను తిలకించాలని సదస్సుకు హాజరైన అతిథులను ప్రధాని మోదీ కోరారు.

యుగపు మార్పులకు కొంత సమయం పడుతుందని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఎన్‌ఈపీలో సంప్రదాయ విజ్ఞానం, భవిష్యత్‌ సాంకేతికతలకు అంతే ప్రాధాన్యం ఉందని చెప్పారు. ప్రాథమిక విద్యలో కొత్త పాఠ్యాంశాలు, ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, ఉన్నత విద్య కోసం, దేశంలో పరిశోధనా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం విద్యా ప్రపంచంలోని వాటాదారుల కృషిని ఆయన ప్రస్తావించారు. 10+2 విధానం స్థానంలో ఇప్పుడు 5+3+3+4 విధానం అమల్లో ఉందని విద్యార్థులకు అర్థమైందని అన్నారు. విద్య 3 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుందని, దీని ద్వారా దేశం మొత్తం ఏకరూపతను తీసుకువస్తుంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలియజేశారు. NEP కింద నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ త్వరలో వస్తుందన్నారు. 3-8 సంవత్సరాల విద్యార్థుల కోసం ఫ్రేమ్‌వర్క్ సిద్ధంగా ఉందన్నారు. దేశం మొత్తం ఒకే విధమైన సిలబస్‌ను కలిగి ఉంటుందని, NCERT దీని కోసం కొత్త కోర్సు పుస్తకాలను సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన చేయడం వల్ల 3 నుంచి 12వ తరగతి వరకు 22 భాషల్లో దాదాపు 130 వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కొత్త పుస్తకాలు రానున్నాయని ప్రధాన మంత్రి తెలియజేశారు.

అదే పెద్ద అన్యాయం..

ఏ విద్యార్థికైనా వారి సామర్థ్యాలకు బదులు వారి భాష ఆధారంగా వారిని అంచనా వేయడమే అతి పెద్ద అన్యాయమని ప్రధాని మోదీ అన్నారు. “మాతృభాషలో విద్య భారతదేశంలోని విద్యార్థులకు న్యాయం చేస్తుంది. సామాజిక న్యాయం దిశగా ఇది కీలక ముందడుగు” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అనేక భాష‌ల‌ను, వాటి ప్రాధాన్యత‌ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు వారి స్థానిక భాష‌ల కార‌ణంగా ఆధిక్యాన్ని పొందాయ‌ని గుర్తు చేశారు. ఐరోపాను ఉదాహరణగా చూపుతూ, చాలా దేశాలు తమ స్వంత మాతృభాషలను ఉపయోగించుకుంటున్నాయని అన్నారు.

భారతదేశంలో స్థిరపడిన భాషల శ్రేణి ఉన్నప్పటికీ, వాటిని వెనుకబాటుకు చిహ్నంగా చూపుతున్నారని, ఆంగ్లంలో మాట్లాడలేని వారిని విస్మరించారని, వారి ప్రతిభను గుర్తించడం లేదని ఆయన వాపోయారు. ఫలితంగా, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారని ప్రధాన మంత్రి అన్నారు. జాతీయ విద్యా విధానం రాకతో దేశం ఇప్పుడు ఈ నమ్మకాన్ని దూరం చేసిందన్నారు. ‘ఐక్యరాజ్య సమితిలో కూడా నేను భారతీయ భాషలోనే మాట్లాడతాను’ అని ప్రధాని మోదీ తెలిపారు.

నూతన విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రం నుండి ఇంజినీరింగ్ వరకు ఉన్న సబ్జెక్టులను ఇప్పుడు భారతీయ భాషలలో బోధించనున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ‘విద్యార్థులు ఒక భాషపై నమ్మకంతో ఉన్నప్పుడు, వారి నైపుణ్యాలు, ప్రతిభ ఎలాంటి పరిమితులు లేకుండా బయటపడతాయి’ అని పేర్కొన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం భాషను రాజకీయం చేసేందుకు ప్రయత్నించే వారు ఇకపై దుకాణాలు సర్ధుకోవాల్సి వస్తుందంటూ పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు. జాతీయ విద్యా విధానం దేశంలోని ప్రతి భాషకు తగిన గౌరవం, ఘనతను ఇస్తుందన్నారు.

రాబోయే 25 ఏళ్ల అమృత్‌కాల్‌లో శక్తిమంతమైన కొత్త తరాన్ని సృష్టించాలని ప్రధాని అన్నారు. బానిసత్వ మనస్తత్వం నుండి విముక్తి పొందిన తరం, ఆవిష్కరణల కోసం ఆసక్తిని కలిగి ఉందని, సైన్స్ నుండి క్రీడల వరకు అన్ని రంగాలలో అవార్డులను తీసుకురావడానికి సిద్ధంగా ఉందన్నారు. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రయత్నంలో ఎన్‌ఇపి పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

చిన్న పిల్లలతో సరదాగా గడిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us