ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి స్పందించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా! ఆయన ఏమన్నారంటే..?
పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడికి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రతిస్పందించారు. భారతదేశం వెనక్కి తగ్గితే ఉద్రిక్తత తగ్గుతుందని ఆసిఫ్ అన్నారు. షరీఫ్ బలమైన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు.

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరానలు లక్ష్యంగా చేసుకొని.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి క్షిపణి దాడులు చేసింది. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ.. ఇండియా ఒక అడుగు వెనక్కి వెస్తే.. మేం కూడా ఈ ఉద్రిక్తతను తగ్గిస్తామంటూ పేర్కొన్నారు. గత పక్షం రోజులుగా మేం ఇండియాపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోబోమని చెబుతున్నాం. కానీ ఇండియా దాడి చేస్తే, మేం ప్రతిస్పందిస్తాం. భారతదేశం వెనక్కి తగ్గితే, మేం కచ్చితంగా ఈ ఉద్రిక్తతను తగ్గిస్తాం. కానీ, మేం దాడికి గురైతే, మనల్ని మనం రక్షించుకోవాలి” అని ఆసిఫ్ అన్నారు.
అంతకుముందు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. “ఇండియా విధించిన ఈ యుద్ధ చర్యకు బలవంతంగా స్పందించే హక్కు పాకిస్తాన్కు ఉంది. బలమైన ప్రతిస్పందన ఇస్తాం” “మొత్తం దేశం పాకిస్తాన్ సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది. మొత్తం పాకిస్తాన్ దేశ నైతికత, స్ఫూర్తి ఉన్నతంగా ఉన్నాయి. పాకిస్తాన్ దేశానికి, పాకిస్తాన్ సాయుధ దళాలకు శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలుసు. శత్రువు వారి దుర్మార్గపు లక్ష్యాలలో విజయం సాధించడానికి మేం ఎప్పటికీ అనుమతించం” అని షరీఫ్ జోడించారు.
భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ను నిర్వహించాయి. మొత్తం తొమ్మిది లక్ష్యాలపై దాడులు విజయవంతమయ్యాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్), లష్కరే-ఎ-తోయిబా (ఎల్ఇటి) అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి భారత దళాలు ఈ ప్రదేశాలను ఎంచుకున్నాయి. “ఆపరేషన్ సిందూర్” పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి