సూడాన్ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది. ఇప్పటికే సుడాన్ నుంచి జెడ్డాకు 11,00 మంది భారతీయులు చేరుకున్నారు. వారిని ఇండియా పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ ఆపరేషన్ కావేరికి ఇన్చార్జ్గా కేంద్రమంత్రి మురళీధరన్ ఉన్నారు. ఆయన జెడ్డాలో అన్ని దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. జెడ్డాకు వచ్చిన భారతీయులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా మొదటి ప్రత్యేక విమానం 360 మంది భారతీయులతో ఢిల్లీ చేరుకుంది. ఆ తరువాత మరో బ్యాచ్లో 278 మందిని తీసుకువచ్చారు. వీరికి అధికారులు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. సూడాన్లో చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయని, ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదని తిరిగి వచ్చిన భారతీయులు చెబుతున్నారు. ఆపరేషన్ కావేరి చేపట్టిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు సుడాన్లో జరుగుతున్న ఘర్షణల్లో చనిపోయిన భారతీయుడు ఆల్బర్ట్ అగస్టీన్ కుటుంబాన్ని పరామర్శించారు కేంద్రమంత్రి మురళీధరన్. జెడ్డాలో ఆ కుటుంబాన్ని కలిసి వారిని కొచ్చి పంపించేందుకు టికెట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి.
సుడాన్పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సంక్షోభంలో ఉన్న సుడాన్లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని భారత్కు తరలించేందుకు ‘ఆపరేషన్ కావేరి’కు కేంద్రం శ్రీకారం చుట్టింది. సూడాన్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకొస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..