కేరళ.. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో నో లింక్..సీఎం పినరయి విజయన్
కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ తో తమ కార్యాలయానికి లింక్ ఉందని వచ్చిన ఆరోపణలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. స్వప్నను 'వివాదాస్పద మహిళ' గా పేర్కొన్న ఆయన..
కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ తో తమ కార్యాలయానికి లింక్ ఉందని వచ్చిన ఆరోపణలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. స్వప్నను ‘వివాదాస్పద మహిళ’ గా పేర్కొన్న ఆయన.. ఆమెకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గోల్డ్ స్మగ్లింగ్ జరిగిందన్న విషయం నిజమేనని. కానీ కస్టమ్స్ శాఖ సమర్థంగా ఈ రాకెట్ ని ఛేదించిందని ఆయన చెప్పారు. ఈ రాకెట్ కి, తమ ప్రభుత్వానికి లింక్ ఎలా పెడతారన్నారు. ఆ ‘మహిళ’ కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్న ఐటీ కార్యదర్శి ఎం.శివశంకర్ ని తొలగించామని అన్నారు. ‘ఈ కేసులో ఎవరో వ్యక్తి నిందితుల తరఫున కస్టమ్స్ కార్యాలయానికి ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి.. కానీ దీన్ని ఆ కార్యాలయమే తోసిపుచ్చింది’ అని విజయన్ పేర్కొన్నారు.
బంగారానికి సంబంధించిన ‘డిప్లొమాటిక్ బ్యాగేజీ’ ని మా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ సంస్థకైనా అందజేశారా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంబసీకి ఉద్దేశించినదని, అంతే తప్ప ప్రభుత్వానికి కాదని ఆయన చెప్పారు.దీనికి, సర్కారుకి లింక్ ఎలా పెడతారన్నారు. ‘ఐటీ శాఖకు కూడా ఆ మహిళ తో డైరెక్ట్ సంబందం లేదు.. ఆ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యాన వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి.. వాటిలో స్పేస్ పార్క్ కూడా ఒకటి.. బహుశా ఆమెకు ఏదో హోదాలో… అది కూడా కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమించి ఉండవచ్చు.. ‘అని విజయన్ పేర్కొన్నారు. ఆమెను ఓ ఏజన్సీ ద్వారా నియమించి ఉండవచ్ఛునన్నారు. స్వప్న సురేష్ గతంలో చేసిన ఉద్యోగాల్లో కేంద్రం తరఫున ఎవరి పలుకుబడో ఉంటుందని భావిస్తున్నామని, నిందితులను కాపాడడానికి తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ యత్నించబోదని ఆయన స్పష్టం చేశారు.