Pahalgam Attack Update: పహల్గామ్ ఉగ్రదాడి.. NIA దర్యాప్తులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
జమ్మూకాశ్మీర్లోని అనంత నాగ్ జిల్లా పెహల్గాం బైసరసన్ వ్యాలీలో ఏప్రిల్ 22 న జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కీలక విషయాలను రాబట్టింది. డీఐజీ, ఐజీ,ఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలోని 45 మంది బృందం దర్యాప్తు చేసిన NIA .. ఉగ్రదాడి 7 రోజుల ముందే ఉగ్రవాదులు పహల్గామ్కు చేరుకున్నట్టు గుర్తించింది. భారీ ప్రాణనష్టం తలపెట్టేందుకు ఉగ్రవాదులు మొత్తం నాలుగు పర్యాటక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు గుర్తించింది.

జమ్మూకాశ్మీర్లోని అనంత నాగ్ జిల్లా పెహల్గాం బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22 న టూరిస్టులపై ఉగ్ర ముష్కరులు విరుచుకుపడి అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. టూరిస్టులకు అత్యంత దగ్గరగా వచ్చి పాయింట్ బ్లాంక్లో గన్స్ పెట్టి విచక్షణారహితంగా కాల్చి చంపారు. మతాన్ని అడిగి.. వెతికి, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య భారతదేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్ముకశ్మీర్ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడిలో మొత్తం 28 మంది చనిపోయారు. ఈ దారుణమైన చర్య ప్రతి ఒక్క భారతీయుడి రక్తాన్ని మరిగించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తును ముమ్మరం చేసింది. డీఐజీ, ఐజీ,ఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలోని 45 మంది బృందంతో అన్ని కోణాల్లో కొనసాగుతున్న NIA దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఇప్పటి వరకు 2500 మంది అనుమానితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అందులో సుమారు 186 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఉగ్ర ఘటనకు ముందు, ఘటన జరిగిన రోజు బైసరన్ వ్యాలీలో ఉన్న పర్యాటకులు, ప్రత్యక్ష సాక్షులు, జిప్ లైన్ ఆపరేటర్లు,హోటల్ యజమానులు, టూరిస్ట్ గైడ్స్, పర్యాటకులు ఇచ్చిన వాంగ్మూలాలు, పర్యాటకులు తీసిన వీడియోల ఆధారంగా కేసు దర్యాప్తు NIA ముందుకు తీసుకెళ్తోంది. అందులో భాగంగానే పాక్ ఉగ్రవాదులకు సహకరించే స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ దాదాపు 20 మందిని NIA అరెస్ట్ చేసింది. అందులో నలుగురు OGWలు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేశారని NIA దర్యాప్తులో వెల్లడైంది. దాడికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు బైసరన్ లోయలో ఉన్నారని NIA గుర్తించింది. ఏప్రిల్ 15న ఉగ్రవాదులు పహల్గామ్ చేరుకున్నారని, రెండు రోజుల పాటు బైసరన్ వ్యాలీలో ఉన్నారని NIA వర్గాలు గుర్తించాయి.
భారీ ప్రాణ నష్టం లక్ష్యంగా ఉగ్రదాడులకు ప్లాన్..
ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన బైసరన్ లోయ కాల్పుల్లో 28 మంది పర్యాటకులు చనిపోయారు..అయితే ఉగ్రవాదుల లక్ష్యం భారీ ప్రాణ నష్టం ఈ ఒక్క ప్రాంతమే కాకుండా మరో మూడు ప్రదేశాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు NIA దర్యాప్తులో తేలింది. అరు లోయ, అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ లోయ ఈ మూడు ప్రదేశాలు లక్ష్యంగా ఉన్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా, దాడి జరపలేకపోయారని NIA దర్యాప్తులో తేలింది. లోయలో మూడు సాటిలైట్ ఫోన్లను ఉపయోగించినట్లు.. వాటి సిగ్నల్ ఆధారాలను NIA సేకరించింది. ప్రస్తుతం పెహల్గాం చేరుకున్న NIA డీజీ సదానంద డేట్ సహా ఉన్నతాధికారులు కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




