దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధం

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమైంది. దీపావళి బాణాసంచాతో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధం
Follow us

|

Updated on: Nov 09, 2020 | 2:54 PM

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమైంది. దీపావళి బాణాసంచాతో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో నవంబరు 9 అర్ధరాత్రి నుంచి నవంబరు 30 వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ సంపూర్ణ నిషేధం విధించింది. అంతేగాక, నవంబరులో గతేడాది కంటే గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని ట్రిబ్యునల్ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రైబ్యూనల్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిని ట్రిబ్యునల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక, గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని వెల్లడించింది. దీపావళి, క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకల్లో బాణసంచా పేల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. కాలుష్యంతో కొవిడ్‌-19 వైరస్‌ మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణ స్థితికి పడిపోయిందని, హరిత టపాసులు కూడా శ్రేయస్కరం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దేశ రాజధానిలో అన్ని రకాల టపాసులపై నిషేధం విధించింది. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల హరిత టపాసులకు అయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.