AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ నీట్ ఎగ్జామ్ రాసే ధైర్యం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య! స్పందించిన రాహుల్ గాంధీ

నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించగా, విద్యా వ్యవస్థ వైఫల్యంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

మళ్లీ నీట్ ఎగ్జామ్ రాసే ధైర్యం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య! స్పందించిన రాహుల్ గాంధీ
Akanksha Neet
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 12:54 PM

Share

ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షా పేపర్ లీక్ కావడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థిని కూడా ప్రాణాలు తీసుకుంది. ఎంతో కష్టపడి పరీక్ష రాస్తే, లీక్ కారణంగా అది రద్దు అయితే.. మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందనే ఒత్తిడితో మధ్యప్రదేశ్‌కి చెందిన ఆకాంక్ష అనే 18 ఏళ్లు విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘ఆకాంక్ష డాక్టర్ అయ్యి, దేశానికి, సమాజానికి సేవ చేయాలనుకుంది. ఆకాంక్ష తండ్రి ఒక రైతు. తన కూతురు డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి, ఆయన కిసాన్ క్రెడిట్ కార్డ్ మీద రూ.3 లక్షల రుణం తీసుకున్నారు. అంతేకాదు, తన కూతురు అక్కడ కోచింగ్‌కు వెళ్లడం కోసం నాగ్‌పూర్‌లో వంటవాడిగా కూడా పనిచేశారు.

ఒక తండ్రిగా ఆయన చేయగలిగినదంతా చేశారు. ఆ తర్వాత నీట్ పేపర్ లీక్ అయింది. పరీక్ష రద్దయింది. ఆ అనిశ్చితిలోనే ఆకాంక్ష మనల్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయింది. ఆకాంక్ష మరణం ఆత్మహత్య కాదు, అది మోదీజీ హయాంలోని అవినీతిమయమైన, విచ్ఛిన్నమైన వ్యవస్థ పర్యవసానం. ఇక ధర్మేంద్ర ప్రధాన్ జీ విషయానికొస్తే? ఆయన ఈనాటికీ అదే కుర్చీలో ఉన్నారు. అదే కమిటీ. అవే బదిలీలు. అవే విచారణలు. సంస్కరణలు లేవు, న్యాయం లేదు. మోదీ జీ.. అధికారం శాశ్వతం కాదు. అది వస్తూ పోతూ ఉంటుంది. కానీ మీరు 12 ఏళ్లలో విద్యా వ్యవస్థను ఎంతగా నాశనం చేశారంటే, భారతదేశంలోని యువతరం మొత్తం దాని మూల్యం చెల్లిస్తోంది.’ అని తీవ్రంగా విమర్శించారు.

కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్..

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లా మగనియా గ్రామానికి చెందిన ఆకాంక్ష నాగ్‌పూర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుంది. మే 3న నీట్ పరీక్ష రాసింది. 650 మార్కులు వస్తాయని ధీమాగా ఉంది. కానీ పేపర్ లీక్‌తో నీట్ పరీక్షను రద్దు కావడంతో మే 20న తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆలస్యంగా ఆమె చేతిరాతతో ఉన్న సూసైడ్ నోట్ తాజాగా బయటపడింది.

“అమ్మా నాన్నా.. మీరు నా మీద ఎంతో నమ్మకం ఉంచారు. నేను డాక్టర్ అవుతానని ఆశించారు. కానీ మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు. మొదటిసారి పరీక్షలో నాకు మంచి మార్కులు వచ్చేవి. కానీ ఇప్పుడు మళ్లీ అంత మంచి మార్కులు వస్తాయన్న నమ్మకం లేదు. నన్ను క్షమించండి, నేను అంతా పాడు చేశాను’ అని ఆకాంక్ష తన చావుకి కారణాన్ని తెలిపింది. ఆకాంక్ష తండ్రి కృష్ణ కుమార్ చౌబే వ్యవసాయ కూలీ. కూతురు చదువు కోసం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా సుమారు రూ.3 లక్షల అప్పు తీసుకున్నారు. కోచింగ్ ఖర్చులు భరించడానికి నాగ్‌పూర్‌లో వంటవాడిగా పని చేశారు. బంధువుల నుంచి కూడా ఆర్థిక సహాయం కూడా తీసుకున్నారు. ఒక తండ్రిగా తన కూతురి భవిష్యత్తు కోసం ఇంత చేసినా సిస్టమ్ విఫలం అవ్వడంతో ఆ తండ్రికి కడుపు కోతే మిగిలింది. కాగా పేపర్ లీక్ తర్వాత ఆకాంక్ష తినడం మానేసి, మాట్లాడడం తగ్గించి తీవ్ర ఆందోళనలో ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us