ఇంకా ఎంతమంది ఉన్నార్రా..? మరో పాక్ ఏజెంట్ అరెస్ట్! బెట్టింగ్ గేమ్స్ కోసం దేశ భద్రత తాకట్టు..
ఢిల్లీ నేవీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్న విశాల్ యాదవ్ అనే వ్యక్తిని పాకిస్థాన్కు రహస్య సమాచారం లీక్ చేసినందుకు రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ ఏజెంట్లపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల్లోని మన సైన్యం లేపేసింది. అయితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. దేశంలో పాకిస్థాన్ ఏజెంట్లను కూడా ఏరివేత మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే అనేక మంది పట్టుబడ్డారు. ఇండియాలో ఉంటూ, ఇండియాలో తింటూ.. పాకిస్థాన్ కోసం పనిచేస్తున్న చాలా మంది దేశద్రోహులను పోలీసులు పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. తాజాగా మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరపున చాలా సంవత్సరాలుగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయం నుండి ఒక వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని సెల్ఫోన్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. విశాల్ యాదవ్ అనే వ్యక్తి నేవీ, ఇతర రక్షణ విభాగాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తానీ వ్యక్తికి అందించాడని, బదులుగా భారీగా డబ్బు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. నేవీ ప్రధాన కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్న విశాల్ యాదవ్ను రాజస్థాన్ పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగం అరెస్టు చేసింది. విశాల్ హర్యానాకు చెందిన వ్యక్తిగా సమాచారం.
పాకిస్తాన్ నిఘా సంస్థలు నిర్వహిస్తున్న గూఢచర్య కార్యకలాపాలను రాజస్థాన్లోని సిఐడి నిఘా విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోందని సీనియర్ పోలీసు అధికారి విష్ణుకాంత్ గుప్తా తెలిపారు. నిఘా సమయంలో వారు యాదవ్ను గమనించారని, పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ మహిళ అతనితో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన అన్నారు. ప్రియా శర్మ అనే మహిళ రహస్య సమాచారాన్ని సేకరించేందుకు అతనికి డబ్బు చెల్లిస్తోందని అధికారి తెలిపారు. విశాల్ యాదవ్ ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి బానిసయ్యాడని, అతని నష్టాలను పూడ్చుకోవడానికి డబ్బు అవసరమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఖాతా ద్వారా డబ్బును అందుకుంటున్నాడని, నేరుగా తన బ్యాంకు ఖాతాలలోకి కూడా డబ్బును అందుకుంటున్నాడని అధికారి తెలిపారు. జైపూర్లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో విశాల్ యాదవ్ను వివిధ నిఘా సంస్థలు సంయుక్తంగా విచారిస్తున్నాయి. ఈ రాకెట్లో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉన్నారో, ఎంత సున్నితమైన సమాచారం లీక్ అయిందో తెలుసుకోవడానికి భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
