Nari Shakti in Navy: భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్తా పూనియా.. మరో నవశకం ఆరంభం!
నేవీలో మొదటి మహిళగా ఫైటర్ పైలట్గా సబ్ -లెఫ్టినెంట్ ఆస్తా పూనియా బాధ్యతలు చేపట్టనున్నారు. నేవీ ఏవియేషన్లో ఆస్తా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా నిలిచినందుకు అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ ప్రసంశించారు..

విశాఖపట్నం, జులై 5: ఇండియన్ నేవీలో శిక్షణ పొందిన మొదటి మహిళా ఫైటర్ పైలట్గా సబ్ -లెఫ్టినెంట్ ఆస్తా పూనియా చరిత్ర సృష్టించారు. ఆమె దేశ నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. నౌకాదళంలో మహిళా ఫైటర్ల చేరికతో నూతన శకం ఆరంభమైందని అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ అన్నారు. నేవీ ఏవియేషన్లో ఆస్తా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా నిలిచినందుకు ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో సముద్రంలో విమాన వాహక నౌకల నుంచి MiG-29K ఫైటర్ జెట్లను నడపనున్నారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు చెందిన విశాఖపట్నంలోని నేవల్ ఎయిర్స్టేషన్ ఐఎన్ఎస్ డేగాలో శుక్రవారం రెండో ప్రాథమిక హాక్ కన్వర్షన్ కోర్సు ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్లపై పరివర్తన యుద్ధ శిక్షణను పూర్తి చేసిన ఆస్తా పూనియాతోపాటు లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్కు ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డులు అందజేశారు. దీంతో సబ్-లెఫ్టినెంట్ పూనియా నావికాదళ విమానయానంలో యుద్ధ విమానాల విభాగంలోకి ప్రవేశించిన మొదటి మహిళగా నిలిచారు. అన్ని అడ్డంకులను ఛేదించి, నావికాదళంలో మహిళా యుద్ధ పైలట్ల కొత్త శకానికి నాంది పలికినట్లైంది.
ఆమెకు రాబోయే శిక్షణ దశలో క్యారియర్ ఆధారిత కార్యకలాపాలను అనుకరించే విమానాలపై విస్తృతమైన సార్టీలు ఉంటాయి. విమాన వాహక నౌక ఫ్లైట్ డెక్ను అనుకరించే స్కీ-జంప్ నుంచి టేకాఫ్లు కూడా ఉంటాయి. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఆమె నేవీ ప్రాథమిక క్యారియర్ ఆధారిత యుద్ధ విమానం అయిన MiG-29Kని ఆపరేట్ చేయడానికి అర్హత సాధిస్తారు. ఇప్పటికే భారత వైమానిక దళంలో 20 మందికి పైగా మహిళా యుద్ధ పైలట్లను చేర్చుకున్న సంగతి తెలిసిందే. సాయుధ దళాలలో ఫ్రంట్లైన్ పోరాట పాత్రలలో మహిళల ఏకీకరణను ఇది ప్రతిబింబిస్తుంది.
A New Chapter in Naval Aviation#IndianNavy marks a historic milestone with the graduation of the Second Basic Hawk Conversion Course on #03Jul 2025 at @IN_Dega.
Lt Atul Kumar Dhull and Slt Aastha Poonia received the prestigious ‘Wings of Gold’ from RAdm Janak Bevli, ACNS (Air).… pic.twitter.com/awMUQGQ4wS
— SpokespersonNavy (@indiannavy) July 4, 2025
భారత నావికాదళం ప్రస్తుతం క్యారియర్ ఆధారిత కార్యకలాపాల కోసం 45 రష్యన్ MiG-29K విమానాలను నడుపుతోంది. ఈ విమానాలను భారత్లోని రెండు విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, INS విక్రాంత్లలో మోహరించారు. ఈ సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్లో రూ.64 వేల కోట్ల అంచనా వ్యయంతో 26 డస్సాల్ట్ రాఫెల్ మెరైన్ విమానాలను కొనుగోలు చేసేందుకు కీలక ఒప్పందంపై సంతకం చేసింది. స్వదేశీ ట్విన్ ఇంజిన్ డెక్-బేస్డ్ ఫైటర్ (TEDBF) కార్యాచరణలోకి వచ్చే వరకు భారత్ సముద్ర దాడి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ జెట్లు ఉపయోగించనున్నారు. ఇక నిఘా (ISR) కోసం రూపొందించిన సెమీ-సబ్మెర్సిబుల్ అటానమస్ నౌకల సేకరణను కూడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ప్లాట్ఫారమ్లను మేక్-2 వర్గం కింద అభివృద్ధి చేస్తారు. అంటే అవి ప్రభుత్వ నిధుల ప్రమేయం లేకుండా ప్రైవేట్ పరిశ్రమ ద్వారా నిర్మించబడతాయన్నమాట.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.