Monsoon: కాస్త ముందుగానే నైరుతి రాక.. మే 27న కేరళను తాకనున్న రుతుపవనాలు! ఈసారి రైతులకు పండగే..
గతేడాది మే 30న రుతుపవనాలు రాగా.. ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగా యేటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తుంటాయి. ఆ తర్వాత అవి విస్తరించడంతో దేశమంతటా విస్తారంగా వర్షాలు కురవడం ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం నాలుగు రోజులు ముందుగానే..

ఈ ఏడాది దేశంలోకి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. సాధారణంగా యేటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తుంటాయి. ఆ తర్వాత అవి విస్తరించడంతో దేశమంతటా విస్తారంగా వర్షాలు కురవడం ప్రారంభమవుతాయి. అలా జులై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం నాలుగు రోజులు ముందుగానే అంటే మే 27న కేరళలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. గతేడాది రుతుపవనాలు మే 30న కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ప్రకటించింది.
గతేడాది మే 30న రుతుపవనాలు రాగా.. 2023 జూన్ 8న, 2022 మే 29న దేశంలోకి ప్రవేశించాయి. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2023లో ఎలో నినో కారణంగా అతితక్కువ వర్షపాతం (94శాతం) నమోదైంది. 2023కి ముందు వరుసగా నాలుగేళ్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావడం గమనార్హం.
ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు లేనేలేవని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పైగా సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏకంగా 105 శాతం వర్షపాతం కురవనున్నట్లు అంచనా వేసింది. రుతుపవనాల రాక అయత్తమవడంతో అండమాన్ సముద్రం, కేరళ పరిసర ప్రాంతాల చుట్టూ దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.
కాగా భారత్లో మొత్తం వ్యవసాయం ఇప్పటికే వర్షపాతం మీదనే ఆధారపడి ఉంది. దాదాపు 70 శాతం వర్షపాతం ఆధారంగానే పంటలు పండుతున్నాయి. మన ఆర్ధిక వ్యవస్థాకే జీవనాడి వ్యవసాయమే. దేశ వ్యవసాయ భూమిలో 51 శాతం అంటే 40 శాతం వర్షాధారంగా సాగవుతుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జనాభాలో 47% మంది జీవనోపాధి వ్యవసాయంపై ఆధారపడి ఉంది. దేశ వ్యవసాయం.. గ్రామీణ రంగాలకు చాలా కీలకం. ఈ ఏడాది కురవనున్న మంచి వర్షాలు.. చక్కెర, పప్పుధాన్యాలు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి వచ్చేందుకు సహాయపడతాయి. తద్వారా ద్రవ్యోల్బణ సమస్యను అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ శుభపరిణామం సామాన్యుడికి శుభవార్తనే చెప్పాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.