AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు..” ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా, కరైరాలో గురువారం (ఏప్రిల్ 16) ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధికార గర్వం, మితిమీరిన వేగం తోడై ఐదుగురు వ్యక్తుల ప్రాణాలను సంకటంలోకి నెట్టాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, పిచోరే ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడు దినేష్ లోధి, తన థార్ వాహనంతో బీభత్సం సృష్టించి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచారు.

సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు.. ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!
Pichhore Mla Son Met With An Accidenta
Balaraju Goud
|

Updated on: Apr 16, 2026 | 7:54 PM

Share

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా, కరైరాలో గురువారం (ఏప్రిల్ 16) ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధికార గర్వం, మితిమీరిన వేగం తోడై ఐదుగురు వ్యక్తుల ప్రాణాలను సంకటంలోకి నెట్టాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, పిచోరే ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడు దినేష్ లోధి, తన థార్ వాహనంతో బీభత్సం సృష్టించి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచారు.

ఏప్రిల్ 16వ తేదీ ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దతియా జిల్లాకు చెందిన సంజయ్ పరిహార్, తన స్నేహితులు ఆశిష్, అన్షుల్‌లతో కలిసి బైక్‌పై తన్రా గ్రామానికి వెళ్తుండగా, కరైరా పోలీస్ స్టేషన్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన నల్లటి థార్ రాక్స్ కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత అదే వేగంతో రోడ్డుపై వెళ్తున్న సీతా వర్మ, పూజా సోని అనే ఇద్దరు మహిళలను కూడా కారు చిదిమేసింది. ప్రమాద తీవ్రతకు ఐదుగురు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. బాధితులకు కాళ్లు, చేతులు విరగడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు మంత్రి కుమారుడిని నిలదీయగా, ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం అందరినీ విస్తుపోయేలా చేసింది. “నేను సైరన్ మోగించాను, హారన్ కొట్టాను.. అయినా వాళ్లు ఎందుకు ఆగలేదు? ముగ్గురు కలిసి బైక్‌పై వెళ్తూ చేతులు ఊపడం వల్లే ఇలా జరిగింది” అంటూ బాధితులనే నిందించడం వీడియోలో రికార్డైంది. ఆ వాహనంపై ‘ప్రీతమ్ లోధి – ఎమ్మెల్యే’ అని రాసి ఉండటం గమనార్హం. కేవలం జిమ్‌కు వెళ్లే క్రమంలో దినేష్ లోధి ఈ స్థాయిలో వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారకుడయ్యారని స్థానికులు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై బాధితుడు సంజయ్ పరిహార్ ఫిర్యాదు మేరకు కరైరా పోలీసులు దినేష్ లోధిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. మంత్రి కుమారుడు రాజకీయంగా తన పట్టు పెంచుకోవడానికి కరైరాలో నివసిస్తున్నారని సమాచారం. అధికారం అండతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us