Jammu-Kashmir Uri Encounter: జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. భారత జవాన్ మృతి
స్వాతంత్ర్య దినోత్సవం వేళ కశ్మీర్లో LOC దగ్గర పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. యూరీ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ జవాన్ చనిపోయాడు. యూరీ సెక్టార్తో పాటు సుందర్బని ప్రాంతంలో ఆర్మీ అధునాతన ఆయుధాలతో కూంబింగ్ నిర్వహిస్తోంది.

స్వాతంత్ర్య దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను సైన్యం భగ్నం చేసింది. బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్ కుట్రను ఆర్మీ తిప్పికొట్టింది. భారత్లో చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పుల్లో హతమయ్యారు. పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు. వాస్తవాధీన రేఖ LOC దగ్గర భద్రతా బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అధునాతన ఆయుధాలతో సరిహద్దును కంటికి రెప్పలా కాపాడుతున్నాయి.
LOC దగ్గర అణువణువు కూంబింగ్
LOC దగ్గర అణువణువు జల్లెడ పడుతున్నయి భద్రతా బలగాలు . బారాముల్లా , రాజోరి జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రాజోరి జిల్లా సుందర్బని ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టారు. అధునాతన రోబోలతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులు అమర్చిన IEDలను నిర్వీర్యం చేసేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ను కూడా ఉపయోగిస్తున్నారు.
కీలక ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా
యూరీ సెక్టార్లో కీలక ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా పెట్టారు. పూర్తిగా అధునాతన ఆయుధాలతో ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కాల్పులకు ధీటైన సమాధానం ఇవ్వడానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఆర్మీ వినియోగిస్తోంది. ఈ వాహనాలు కవర్ చేయడంతో కమెండోలు ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపుదాడులకు సిద్దమవుతున్నారు. గత కొంతకాలంగా LOC లోని అటవీ ప్రాంతాలను తమ స్థావరాలుగా మార్చుకుంటున్నారు ఉగ్రవాదులు. నెలల తరబడి ఆ స్థావరాల్లో తిష్టవేసి జమ్ముకశ్మీర్లో దాడులకు పాల్పడి పారిపోతున్నారు. అందుకే వాటిని ధ్వంసం చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
జమ్ముకశ్మీర్లో ప్రతి ఏటా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను అడ్డుకోవడానికి ఉగ్రవాదులు రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఈసారి కూడా టెర్రరిస్టులు దాడి చేస్తారన్న సమాచారంతో సరిహద్దుపై గట్టి నిఘా పెట్టారు. అధునాతన డ్రోన్లను కూంబింగ్ కోసం వినియోగిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలపై సీసీటీవీ కెమెరాలతో కూడా నిఘా పెట్టారు.
ఉగ్రవాద శిబిరాలను మళ్లీ యాక్టివ్ చేసినట్టు సమాచారం
ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పడు పసిగట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత కూడా పాకిస్తాన్కు బుద్ది రాలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను మళ్లీ యాక్టివ్ చేసినట్టు సమాచారం అందింది. దీంతో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పడానికి భారత్ రెడీ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








