Fight against Corona: కరోనా పై పోరాటంలో ఇండోర్ రూటే సపరేటు..అధికారులకు అండగా స్థానిక సంస్థలు..కోవిడ్ పై ఉమ్మడి పోరు!

మామూలుగా వచ్చే ఒక కష్టం ఎదుర్కోవాలంటేనే ఎంతో ఇబ్బంది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఆ కష్టం నుంచి బయటపడలేం. మరి ఊకుమ్మడిగా అందరికీ కష్టం వస్తే.. అదీ ప్రాణాలు తీసేస్తుంటే..

Fight against Corona: కరోనా పై పోరాటంలో ఇండోర్ రూటే సపరేటు..అధికారులకు అండగా స్థానిక సంస్థలు..కోవిడ్ పై ఉమ్మడి పోరు!
Indore
Follow us

|

Updated on: May 01, 2021 | 4:33 PM

Fight against Corona:  మామూలుగా వచ్చే ఒక కష్టం ఎదుర్కోవాలంటేనే ఎంతో ఇబ్బంది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఆ కష్టం నుంచి బయటపడలేం. మరి ఊకుమ్మడిగా అందరికీ కష్టం వస్తే.. అదీ ప్రాణాలు తీసేస్తుంటే దానిని ఎదుర్కుని అందరిలో ధైర్యం నింపాలంటే ఎంతో ప్లానింగ్ కావాలి. ప్రభుత్వ వ్యవస్థలే కరోనా కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలా అని మల్లాగుల్లాలు పడుతుంటే.. అక్కడ సమాజ సేవా సంస్థలు మాత్రం మెరుపు వేగంతో స్పందించాయి. తమకున్న పరిధిలో ఎంత వేగంగా పరిస్థితులలో ఉన్న ఇబ్బందుల్ని దారిలోకి తేవాలో అనే విషయంపై దృష్టి పెట్టిన వారు కొద్ది రోజుల్లోనే అక్కడి పరిస్థితులు చక్కబడేలా తమవంతు ప్రయత్నాలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విరుచుకు పడిన 25 రోజుల్లోపే ఆ సామాజిక సంస్థల కార్యకర్తలు ఈ మహమ్మారిపై పోరాడటానికి 18 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో కరోనా రెండో వేవ్ ఎదుర్కోవడానికి అక్కడి సంస్థలు.. సామాజిక కార్యకర్తలు అధికారులతో కలిసి అద్భుతాలే చేస్తున్నారు.

తాము సేకరించిన 18 కోట్ల రూపాయలతో మొదట ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యంత్రాలను కొనుగోలు చేశారు, వీటిని ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచారు. సేవా వాహనాలు, అంబులెన్స్‌లను సమీకరించారు. మెడికల్ ఎక్విప్మెంట్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. అవసరమైనప్పుడు ప్రజలకు ఇంట్లో ఉచిత సేవ ఇవ్వడానికి సిద్ధంగా వ్యవస్థ రెడీ చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు, మాస్క్ లు, శానిటైజర్లు అలాగే, అవసరమైన మందులు అందుబాటులో ఉంచి.. సిటి స్కాన్ వంటి అన్ని సేవలను తక్కువ రేటుకు అందిస్తూ ఇండోర్ ఒక ప్రత్యేకత సాధించింది. అంతేకాదు అవసరమైన వారికి ఆహారాన్ని అందించే ఏర్పాటు కూడా ఇక్కడ చేశారు. ఇదంతా సంకల్ప బలంతో.. అధికారులకు అక్కడి సంస్థలు.. సామాజిక కార్యకర్తలు ఇచ్చిన వేగవంతమైన సహకారంతో సాధ్యం అయ్యాయి.

ఆక్సిజన్ ప్లాంట్ కోసం అరగంటలో కోటిన్నర..

కలెక్టర్ మనీష్ సింగ్‌తో ప్రధాన సంస్థల సమావేశం జరిగింది. అందులో ఆక్సిజన్ ప్లాంట్ కోసం చర్చ జరిగింది. చర్చ పూర్తయిన అరగంటలో ఆక్సిజన్ ప్లాంట్ కోసం రూ .1.25 కోట్లు వసూలు అయ్యాయి. మరుసటి రోజు ఈ మొత్తం 2.5 కోట్లకు చేరుకుంది. దీంతో కోవిడ్ సెంటర్‌లో రెండు ప్లాంట్లు నిర్మిస్తున్నారు.

ఆరోగ్యమే పండగ..

ఇండోర్‌లో, మహావీర్ జయంతి ఊరేగింపు అలాగే స్వామి వత్సల్య కార్యక్రమాల కోసం కేటాయించిన మొత్తాన్ని కూడా కోవిడ్ పై పోరాటానికి కేటాయించేశారు. రెండు సంఘాలు 10–10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యంత్రాలు,ఇతర అవసరమైన పరికరాలను కొనుగోలు చేశాయి. కోవిడ్ కేర్ సెంటర్‌కు 200 పడకల హాస్టల్ ఇవ్వడానికి దిగంబర్ జైన్ సమాజ్ సిద్ధం అయింది. దీనికి అయ్యే ఖర్చులు కూడా సమాజం భరించింది. ప్రజల ఆరోగ్యమే పండగ అని అన్ని సంస్థలూ భావించడంతో ఇది సాధ్యం అయింది.

ఆక్సిజన్ బ్యాంకుగా అగర్వాల్ సమాజం ..

ఆక్సిజన్ కొరత మధ్య, అగర్వాల్ సొసైటీ 251 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యంత్రాలను కొనుగోలు చేస్తోంది. ఇవి ఇప్పటికే బుక్ చేశారు. ఇక వారంలో, ఈ యంత్రాలు రావడం ప్రారంభిస్తాయి. అవి ప్రజలకు ఉచితంగా ఇవ్వనున్నారు.

సంరక్షణ కేంద్రం 7.5 కోట్లు ..

రాధాస్వామి సత్సంగ్ బియాస్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్ కోసం 30 సంస్థలు, 270 మంది రూ .7.5 కోట్లు ఇచ్చారు. ఇందులో కేవలం రెండు రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు సేకరించారు.

ఆసుపత్రులలో పడకలపై ప్రత్యక్ష సమాచారం..

ఈ రోజుల్లో, పడకలకు సంబంధించి చాలా చోట్ల ఆసుపత్రుల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ దృష్ట్యా, వివిధ సంస్థలు, యువజన సంఘాలు ఇక్కడ చొరవ తీసుకున్నాయి. కొన్ని రోజులుగా అరడజనుకు పైగా గ్రూపులు సోషల్ మీడియాలో ఆసుపత్రులలో పడకలకు సంబంధించి ప్రత్యక్ష సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నాయి. ఆసుపత్రిలో పడకలు ఖాళీ అయిన వెంటనే ప్రజలకు వీరు సమాచారం ఇస్తారు, ఇది ప్రజలకు చాలా ఉపశమనం కలిగించింది. ఇవి కాకుండా 1,075 కాల్ సెంటర్లు కూడా నడుస్తున్నాయి.

ఇక IIM ఇండోర్ ప్లాస్మా విరాళం కోసం ఒక వెబ్‌సైట్‌ను నడుపుతోంది, దాతల సమాచారాన్ని పంచుకుంటుంది. గురూజీ సేవా ట్రస్ట్, మహావీర్ మెడికల్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్, పూర్ణ అభ్యుదయ సంగథన్, నీలవర్ణ పార్శ్వన్ నాథ్ కాంచన్‌బాగ్ ట్రస్ట్, శ్వేతాంబర్ జైన్ మహాసంగ్, క్రెడాయ్, నారెడ్కో, ఇండోర్ కెమిస్ట్ అసోసియేషన్, వైశ్య మహాసంవలేన్ సహా 30 కి పైగా సామాజిక, రాజకీయ, వ్యాపార సంస్థలు ఇండోర్ లో జరుగుతున్న కరోనా పై పోరాటంలో తమవంతుగా అన్నివిధాలుగా ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నాయి.

దీంతో ఇక్కడ కరోనా కష్టం పెద్దగా ప్రభావం చూపడంలేదు. జనజీవనం సాఫీగా సాగిపోతోంది. సామాన్యులు కూడా మెరుగైన వైద్య సహాయాన్ని పొందగలుగుతున్నారు. ఇప్పుడు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇండోర్ లాంటి వ్యవస్థ ఏర్పాటు కావలసిన అవసరం ఉంది. అక్కడి సంస్థలు చూపించిన చొరవ ప్రతి చోటా అన్ని సంస్థలూ చూపించాల్సి ఉంది. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి.. అధికారుల ఆలోచనలకు తమ సహకారాన్ని జోడిస్తే ఇండోర్ లాంటి ఫలితాలు దేశవ్యాప్తంగా చూడొచ్చు.

Also Read: Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..

Corona Alert: సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న క‌రోనా వార్త‌ల‌ను చూసి క‌న్ఫ్యూజ్ అవుతున్నారా.? దీనికి ప‌రిష్కారమే..