సుప్రీంకోర్టు మొట్టికాయ తర్వాత భారతదేశంపై డొనాల్డ్ ట్రంప్ ఎంత సుంకం విధిస్తారు?
అసలే ప్రపంచమంతా అమెరికాతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడైన విపత్కర పరిస్థితి. సరిగ్గా ఇప్పుడే అమెరికా అత్యున్నత న్యాయస్థానం అధ్యక్షుడు ట్రంప్ను సుత్తితో నెత్తిమీద బాదేసింది. నువ్వేసిన సుంకాలన్నీ గుండుసున్నాలే అని తేల్చేసింది. ఈ టైమ్లో ట్రంప్ మైండ్ సెట్ ఎలా ఉంది? ముఖ్యంగా భారత్ విషయంలో ఏం ఆలోచిస్తున్నట్టు? నిన్న గాక మొన్న మనతో రాసుకున్న ట్రేడ్ డీల్ రేపటి రోజున ఏమవుతుంది..?

అసలే ప్రపంచమంతా అమెరికాతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడైన విపత్కర పరిస్థితి. సరిగ్గా ఇప్పుడే అమెరికా అత్యున్నత న్యాయస్థానం అధ్యక్షుడు ట్రంప్ను సుత్తితో నెత్తిమీద బాదేసింది. నువ్వేసిన సుంకాలన్నీ గుండుసున్నాలే అని తేల్చేసింది. ఈ టైమ్లో ట్రంప్ మైండ్ సెట్ ఎలా ఉంది? ముఖ్యంగా భారత్ విషయంలో ఏం ఆలోచిస్తున్నట్టు? నిన్న గాక మొన్న మనతో రాసుకున్న ట్రేడ్ డీల్ రేపటి రోజున ఏమవుతుంది..? ప్రస్తుతానికి భారతదేశంపై టారిఫ్ లెక్క 18 శాతమా, లేక 10 శాతమా? అన్న చర్చ మొదలంది.
రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిబంధనలపై వాణిజ్యాన్ని బలవంతం చేయడానికి అన్ని దేశాలపై వేర్వేరు సుంకాలను విధించారు. అయితే, అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించింది. ప్రపంచదేశాలపై ఎడాపెడా పెంచిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు సింగిల్ స్ట్రోక్తో రద్దు చేసిన తర్వాత ట్రంప్ దిమాక్ ఇంకా ఇంకా ఖరాబైనట్టుంది. పిచ్చి తీర్పులిచ్చారంటూ న్యాయమూర్తులనే దేడ్ దిమాక్లని తిట్టిపోశారు. అంతేకాదు, పాత సుంకాల లెక్క అటకెక్కేసరికి, ప్లాన్-B అంటూ యూనిఫామ్గా 10శాతం గ్లోబల్ టారిఫ్ను ప్రకటించేశారు ట్రంప్.
కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24నుంచి అమల్లోకి వచ్చేస్తాయి. అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు అమల్లో ఉండే 150 రోజులూ ఈ 10 శాతం సుంకం వర్తిస్తుంది. ఇటు, భారత్పై అమల్లో ఉన్న 18 శాతం సుంకం కూడా 10 శాతానికి తగ్గినట్టు ప్రకటించింది వైట్హౌస్. మార్చి 2026 నాటికి భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు కావచ్చు. అమెరికా కోర్టు నిర్ణయం తర్వాత, అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రపంచ 10 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఇది వెంటనే అమలులోకి వస్తుంది. తత్ఫలితంగా, భారతదేశం ఇప్పుడు ప్రస్తుత 18 శాతానికి బదులుగా 10 శాతం సుంకానికి లోబడి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో, అమెరికా – భారతదేశం మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం ఒక ఒప్పందాన్ని ప్రకటించినప్పుడు, ట్రంప్ రష్యన్ చమురు కొనుగోలు కోసం భారతదేశంపై విధించిన 25 శాతం శిక్షాత్మక సుంకాన్ని తొలగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు.
ఇదిలావుంటే 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలో ఉండే సెక్షన్ 122.. ఏం చెబుతోందంటే.. సొంత దేశ ప్రయోజనాల కోసం ఏ దేశం పైనైనా అధ్యక్షుల వారు 15 శాతం దాకా సుంకం విధించవచ్చు అని. కానీ, ట్రేడ్ యాక్ట్లోని ఇటువంటి లొసుగుల్ని ట్రంప్ ఎన్నాళ్లని వాడుకుంటారు అనేదే ప్రశ్న. సుప్రీంకోర్టు తీర్పు భారత్-అమెరికా ట్రేడ్ డీల్పై ఎటువంటి ప్రభావం చూపించదు అంటున్నారు ట్రంప్. ఎందుకంటే, ఇది ఏమాత్రం మాయామర్మం లేని చక్కటి ఒప్పందమట. ఆ లెక్క ప్రకారం 18 శాతం టారిఫ్ యధావిధిగా అమలవ్వాల్సిందేనా?
కానీ, ఇది ఫేర్ డీల్ ఎలా అవుతుంది.. అమెరికా వస్తువులపై మనం జీరో డ్యూటీ వేయడం, మన వస్తువులపై అమెరికా 18 శాతం వేయడం.. ఇది ఏరకమైన న్యాయం అనే చర్చ జరుగుతోంది. మనకంటే ఏడింతలు బలమైన ఎకానమీతో ఉన్న అమెరికాపై మనం ఎందుకు జీరో డ్యూటీకి ఒప్పుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, భారతదేశంపై 50 శాతం సుంకాన్ని 18కి తగ్గించానని, అదే గొప్ప త్యాగం అనీ చెప్పుకుంటున్న ట్రంప్.. ఇప్పుడా 18 శాతాన్ని కూడా రద్దు చేసిన సుప్రీంకోర్టుపై భగ్గుమంటున్నారు. ఈ హైటైమ్లో భారత్పై ట్రంప్ మైండ్ సెట్ ఎలా ఉండబోతోంది? అన్న చర్చ మొదలైంది.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా దేశాల్లాగే మన మీద కూడా విధించిన పది శాతంపై ట్రంప్తో బేరసారాలు అడాల్సి ఉంది. ఈ క్రమంలో సుంకాలపై చర్చించడానికి వచ్చేవారం అమెరికాతో భారత్ చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య తాజా వాణిజ్య ఒప్పందాన్ని కూడా మార్చి రాసుకోవాల్సి ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
