మీరు సిటీలో ఉంటున్నారా..? ఇది పక్కా తెలుసుకోవాలి.. షాకింగ్ రిపోర్ట్..
రాబోయే రోజుల్లో భారత్ ఒక నిప్పుల కొలిమిలా మారబోతోందా? మనం నివసించే నగరాలు కాంక్రీట్ అడవులు కాదు.. వేడిని కక్కే అగ్నిగుండాలని మీకు తెలుసా..? తాజాగా విడుదలైన ఒక అంతర్జాతీయ అధ్యయనం సంచలన నిజాలను బయటపెట్టింది. పల్లెల కంటే పట్నాల్లో ఉష్ణోగ్రతలు డబుల్ కాబోతున్నాయన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

దేశంలోని నగరవాసులకు రానున్న కాలం సెగలు పుట్టించనుంది. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మెట్రో నగరాల కంటే మధ్య తరహా నగరాలపైనే ఎక్కువగా ఉండబోతోందని తాజా అధ్యయనం బాంబు పేల్చింది. బ్రిటన్లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఫిబ్రవరి 4న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో ఉష్ణోగ్రతలు అంచనాలకు మించి పెరగనున్నాయి.
ఏమిటీ పట్టణ ఉష్ణ-ద్వీపప్రభావం?
సాధారణంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మనకు తెలుసు. అయితే నగరాల్లో ఉండే కాంక్రీట్ కట్టడాలు, తారు రోడ్లు, పచ్చదనం లేకపోవడం వల్ల ఇవి వేడిని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఫలితంగా పక్కనే ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే నగరాలు చాలా వేగంగా వేడెక్కుతున్నాయి. దీనినే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు.
పాటియాలాలో భయంకరమైన మార్పులు
ఈ అధ్యయనంలో పంజాబ్లోని పాటియాలా నగరం గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ వాతావరణ నమూనాలు ఇక్కడ 2 డిగ్రీల పెరుగుదలను అంచనా వేస్తే పట్టణ ప్రభావం వల్ల అది ఏకంగా 4 డిగ్రీల సెల్సియస్కు చేరే ప్రమాదం ఉంది. అంటే ప్రపంచ సగటు కంటే ఇక్కడ వేడి రెట్టింపు కానుంది. పాకిస్థాన్లోని కరూర్ మినహా, ఆసియాలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న నగరాల్లో పాటియాలా ఒకటిగా నిలిచింది.
18 భారతీయ నగరాలపై నిఘా
పరిశోధకులు భారత్ లోని 18 ప్రధాన నగరాలను పరిశీలించగా, ఇవన్నీ కూడా తమ పరిసర గ్రామల కంటే 45శాతం వేగంగా వేడెక్కుతున్నట్లు తేలింది.
జలంధర్: ఇక్కడ గ్రామీణ ప్రాంతాల కంటే అదనంగా 0.8 డిగ్రీల సెల్సియస్ వేడి పెరుగుతోంది.
చిన్న నగరాలే టార్గెట్: మెట్రో నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న, మధ్య తరహా నగరాలే ఈ ముప్పుకు ఎక్కువగా గురవుతున్నాయి.
పెరగనున్న ఖర్చులు: ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హీట్స్ట్రోక్ కేసులు పెరగడమే కాకుండా ఏసీలు, కూలర్ల వాడకం పెరిగి విద్యుత్, శీతలీకరణపై ప్రజల ఖర్చులు భారంగా మారనున్నాయి.
శాస్త్రవేత్తల హెచ్చరిక
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించిన ఈ నివేదిక ప్రకారం.. వాతావరణ మార్పులను అంచనా వేసే ప్రస్తుత నమూనాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నాయి. దీనివల్ల నగరాల్లో ఉండే అసలైన ముప్పు తక్కువగా కనిపిస్తోంది. వాస్తవానికి మనం ఊహించిన దానికంటే 2.6 నుండి 2.7 డిగ్రీల అదనపు వేడిని నగరాలు ఎదుర్కోబోతున్నాయి. 2026 వేసవి నుండే ఈ ప్రభావం తీవ్రతరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నీటి లభ్యత తగ్గుతుండటంతో నగరాల్లో నివసించే వారు ఇప్పుడే మేల్కొని పచ్చదనాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
