అయ్యో దేవుడా.. మరో గంటలో పెళ్లి.. చీర విషయంలో లొల్లి.. చివరకు ఊహించని ఘోరం..
గుజరాత్లోని భావ్నగర్లో పెళ్లికి గంటల ముందు వధువును కాబోయే భర్త దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చీర, డబ్బు విషయంలో జరిగిన వాగ్వాదం ఈ ఘోరానికి దారితీసింది. ఇనుప రాడ్తో కొట్టి, తలను గోడకు మోది చంపాడు. ఈ ప్రేమ జంట జీవితం విషాదంగా ముగిసింది. పోలీసులు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

గుజరాత్లోని భావ్నగర్ నగరంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు కొద్ది గంటల ముందు వధువును కాబోయే భర్తే దారుణంగా హత్య చేశాడు. పెళ్లికి కట్టుకునే చీర, దానికి సంబంధించిన డబ్బు విషయంలో జరిగిన చిన్న వివాదం ఈ ఘోరానికి దారితీసింది. సోని హిమ్మత్ రాథోడ్ – సాజన్ బరైయా గత ఒకటిన్నర సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. ఇటీవలే వివాహం చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. ఇప్పటికే పెళ్లి పనులు అన్ని అయిపోగా.. శనివారం జరగాల్సిన పెళ్లి కాస్త విషాదంగా ముగిసింది.
పెళ్లికి కొన్ని గంటల ముందు ఇంట్లో సోని, సాజన్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య గొడవకు చీర ఖర్చు, డబ్బు వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. కోపంతో అదుపు తప్పిన సాజన్, సోనిపై దాడికి దిగాడు. ఇనుప రాడ్తో ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను బలంగా గోడకు మోదాడు. ఈ దాడిలో సోని అక్కడికక్కడే మరణించింది. సోని చనిపోయిందని నిర్ధారించుకున్న నిందితుడు సాజన్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సోని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. నిందితుడు సాజన్ పెళ్లి రోజున ఉదయం పొరుగువారితో కూడా గొడవపడినట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాలు ఒప్పుకోకపోయినా ఈ జంట కలిసి జీవిస్తున్నట్లు డీఎస్పీ సింఘాల్ తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రేమించి, అన్ని అడ్డంకులను దాటి కలిసి జీవించిన ఈ జంట.. పెళ్లి వేళ ఒక చిన్న గొడవ కారణంగా విడిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




