Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu: రాజీవ్‌గాంధీ హంతకులను వదిలేయడం కరెక్ట్ కాదు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు..

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్​తోపాటు మరో ఐదుగురు విడుదలైన విషయం తెలిసిందే. 32 ఏళ్లపాటు శిక్ష అనుభవించిన వీరంతా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆదివారం జైలు నుంచి విడుదలయ్యారు.

Venkaiah Naidu: రాజీవ్‌గాంధీ హంతకులను వదిలేయడం కరెక్ట్ కాదు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు..
Venkaiah Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2022 | 11:47 PM

Rajiv Gandhi assassination case: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్​తోపాటు మరో ఐదుగురు విడుదలైన విషయం తెలిసిందే. 32 ఏళ్లపాటు శిక్ష అనుభవించిన వీరంతా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆదివారం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేయడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్‌గాంధీ హంతకులను అలా వదిలేయడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులపై సానుభూతి అవసరం లేదంటూ పేర్కొన్నారు. టెర్రరిజాన్ని కొందరు పాలసీగా పెట్టుకున్నారని.. అలాంటి వారి పట్ల, ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సూచించారు. రాజీవ్ హంతకులను విడుదల చేయడంపై తనకు చాలా బాధ కలిగిందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు.. రాజకీయాలు వేరంటూ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్, రాబర్ట్ పేస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్‌లను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల అనంతరం తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు. 1991లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఎ.జి. పేరరివాలన్‌ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ ఆదేశాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో తమను కూడా ముందస్తుగా విడుదల చేయాలంటూ దోషులు నళిని, రవిచంద్రన్‌ తదితరులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడంతో.. పేరరివాలన్‌ కేసులో తీర్పే వీరికీ వర్తిస్తుందని సుప్రీం కోర్టుస్పష్టం చేసింది. వీరిద్దరితో పాటు మిగతా నలుగురు రాబర్ట్‌ పయాస్‌, జయకుమార్‌, మురుగన్‌, శాంతన్‌ విడుదలకు కూడా కోర్టు ఆదేశించింది.

కాగా.. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో 1991 మే నెలలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) అనే శ్రీలంకన్ తీవ్రవాద గ్రూప్ హతమార్చింది. ఈ దుర్ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది మరణించారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో.. దోషులకు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాదే పేరరివాలన్‌ సహా మురుగన్‌, నళిని, శాంతన్‌ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాలన్‌తో పాటు శాంతన్‌, మురుగన్‌ మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. సోనియాగాంధీ జోక్యంతో 2000లో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురికి కూడా మరణశిక్షను జీవితఖైదుకు మారుస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..