ఆగస్టు 17 నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి సేవలు నిలిపివేత.. కేంద్రం ఆదేశాలు జారీ!
ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.

ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. దీంతో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడిచే సాధారణ వాణిజ్య విమాన సేవలు నిలిచిపోనున్నాయి.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, కూటమి నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ప్రారంభోత్సవంలో గిరిజన కళాకారుల ప్రత్యేక ప్రదర్శన ద్వారా గిన్నిస్ రికార్డు సాధించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలు కూడా భోగాపురం విమానాశ్రయం ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుతూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సౌర హోమం, అష్ట దిగ్పాలకుల ఆవాహన, నవగ్రహ ఆవాహన వంటి కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
కేంద్ర పౌరవిమానయాన శాఖ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం విమానాశ్రయం (ఐఎన్ఎస్ డేగ సివిల్ ఎన్క్లేవ్) నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిపివేయనున్నారు. ఈ నిర్ణయం 30 ఏళ్ల కాలానికి వర్తిస్తుందని పేర్కొంది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుందని తెలిపింది. విశాఖ విమానాశ్రయం నుంచి భారత వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విభాగాలకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల విమానాలు, వీఐపీ, లీజ్ విమానాలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. నాన్షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలకు కూడా అనుమతి ఉంటుందని వెల్లడించింది.
ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ ‘VTZ’ను ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేయనున్నారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా అధికారిక గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం విడుదల చేసింది.
జీఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని 2024 సెప్టెంబర్లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
