పిల్లలపై ప్రయోగాలా ? 2-18 ఏళ్ళ మధ్య వయస్సువారిపై కోవాగ్జిన్ ట్రయల్స్, కేంద్రానికి, భారత్ బయో టెక్ కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్నవారిపై కోవాగ్జిన్ కోవిడ్ వ్యాక్సిన్ 2,3 ట్రయల్స్ నిర్వహణను నిలిపివేసేలా చూడాలంటూ దాఖలైన 'పిల్' ను పురస్కరించుకుని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి, భారత్ బయో టెక్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్నవారిపై కోవాగ్జిన్ కోవిడ్ వ్యాక్సిన్ 2,3 ట్రయల్స్ నిర్వహణను నిలిపివేసేలా చూడాలంటూ దాఖలైన ‘పిల్’ ను పురస్కరించుకుని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి, భారత్ బయో టెక్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వయస్సువారిపై రెండు, మూడు ట్రయల్స్ నిర్వహణకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా.. భారత్ బయో టెక్ కంపెనీకి అనుమతినిచ్చింది.ఈ అనుమతిని రద్దు చేయాలనీ పిటిషనర్ కోరగా..దీనిపై జులై 15 లోగా మీ వైఖరి ఏమిటో తెలియజేయాలని చీఫ్ జస్టిస్ డీ.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ లతో కూడిన బెంచ్ కేంద్రాన్ని, ఈ సంస్థను తమ నోటీసుల్లో కోరింది.ఈ అనుమతిపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థన మీద తాత్కాలిక ఉత్తర్వును జారీ చేయడానికి బెంచ్ తిరస్కరించింది. కాగా ఈ ట్రయల్స్ లో భాగంగా కొవాగ్జిన్ టీకామందును రెండు డోసుల్లో ఇంట్రామస్క్యులర్ రూట్ ద్వారా ఇస్తారు. ప్రస్తుతం ఈ టీకామందును దేశంలో పెద్దలకు ఇస్తున్నారు.
పిల్లల్లోనూ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వారిపై రెండు, మూడు ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించాలన్న భారత్ బయోటెక్ విజ్ఞప్తికి డీజీసీఐ ఆమోదముద్ర వేసింది. అయితే మరీ చిన్న పిల్లలపై కూడా ఇలా ట్రయల్స్ నిర్వహిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాము సుమారు 500 మందిని వలంటీర్లను గుర్తించినట్టు భారత్ బయో టెక్ పేర్కొంది. ఈ ట్రయల్స్ 10 నుంచి 12 రోజుల్లో ప్రారంభమవుతాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ.కె.పాల్ తెలిపారు. ఢిల్లీ, పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రులతో బాటు నాగపూర్ లోని మెడిట్రినా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇవి జరగనున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: CM KCR Gandhi Hospital Visit Live: కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్..