Srinagar: కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్!
దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని టాంగ్మార్గ్ ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ మొదలయింది. టాంగ్మార్గ్లో పోలీసులు, సైన్యం జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం. అనుమానిత ప్రదేశం వైపు దళాల బృందం చేరుకున్నప్పుడు, దాక్కున్న ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరిపారు. దీంతో కౌంటర్గా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి.

జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని టాంగ్మార్గ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతుందని అధికారులు తెలిపారు. టాంగ్మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని ఒక అధికారి తెలిపారు. అనుమానిత ప్రదేశాన్ని భద్రతా దళాల చుట్టుముట్టడంతో.. లోపల దాక్కున్న ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పహల్గామ్లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది పౌరులను చంపి, అనేక మందిని గాయపరిచిన ఒక రోజు తర్వాత ఈ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిగింది.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హైబ్రిడ్ టెర్రరిజం
పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా బయటపడింది. అమాయక పౌరులను కాల్చి చంపింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే.. అంతేకాదు వాళ్లకు ఆదేశాలు కూడా పాకిస్తాన్ నుంచే వచ్చాయి.. హైబ్రిడ్ టెర్రరిస్టులతో పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. లష్కర్ స్లీపర్సెల్ TRF పహల్గామ్లో నరమేథం సృష్టించింది. 2024లో ఆర్మీ క్యాంప్పై దాడి చేసిన ఉగ్రవాదుల బ్యాచే పహల్గామ్లో టూరిస్టులను ఊచకోత కోసింది. ఆ దాడి తరువాత సైలెంట్ ఉన్న ముష్కర మూక పహల్గామ్లో పంజా విసిరింది.
హైబ్రిడ్ టెర్రర్ బ్యాచ్లో సభ్యులపై నిఘా వర్గాల దగ్గర కచ్చితమైన సమాచారం లేదు. టార్గెట్ను ఫినిష్ చేసిన తరువాత ఈ బ్యాచ్ చాలా కాలం సైలెంట్గా ఉంటుంది. టీమ్ సభ్యులు విడిపోయి మళ్లీ కలుస్తారు.. ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటారు.. తరువాత పాకిస్తాన్ నుంచి ఆదేశాలు రాగానే మళ్లీ దాడులు మొదలుపెడుతారు.
పహల్గామ్లో ఇదే జరిగింది. పూంచ్లో దాడికి పాల్పడ్డ TRF గ్రూపుకు పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ లీడ్ చేశాడు. ఈ గ్యాంగ్కు పాకిస్తాన్లో ఉన్న లష్కరే డిప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తున్న సైఫుల్లా నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. పహల్గామ్ దాడి కోసం కరాచీ,ముజఫరాబాద్లో వార్ రూమ్ను ఏర్పాటు చేశాడు సైఫుల్లా..
పాకిస్తాన్ నుంచి ముష్కరమూకకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నట్టు పహల్గామ్ దాడి జరిగిన ప్రదేశం నుంచి NIA డిజిటెల్ ఎవిడెన్స్ను సంపాదించింది. కశ్మీర్ పండిట్ల ఊచకోత వెనుక కూడా హైబ్రిడ్ టెర్రరిస్టుల హస్తమే బయటపడింది.
